● కలెక్టర్ స్నేహ శబరీష్
మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగి సీజన్లో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ కేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. వచ్చేవారం నుంచి కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ధాన్యం రవాణా విషయంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం నర్సింహరావు, డీసీఎస్ఓ రమేశ్ పాల్గొన్నారు.
ఆరోగ్య సూత్రాలు పాటించాలి
ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించి వడదెబ్బ, వేసవి తాపం నుంచి రక్షించుకోవాలని, జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం వేసవి తీవ్రత, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ విద్యాసంస్థలు, జనసాంద్రత ప్రదేశాల్లో వైద్య శిబిరాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యాసంస్థల్లో పిల్లలకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలోని ప్రజలకు వేసవికాలంలో ఆరోగ్య అవసరాల నిమిత్తం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ పాల్గొన్నారు.


