వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో నేడు డీజీపీ శివధర్రెడ్డి పర్యటించనున్నారు. మంగళవారం కర్రెగుట్టల్లో తడపల వద్ద బేస్ క్యాంపును ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కాపెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశ వేదిక వద్ద పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. అనంతరం డీజీపీ కంటి వైద్యశిబిరం ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
10 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలు రోజుకు రెండు విడతలుగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల టైంటేబుల్ షెడ్యూల్ను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు.


