విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ తదితర యాజమాన్యాల పరిధిలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు(వార్షిక పరీక్షలు) సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–2) పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలో సంబంధిత విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
పరీక్షల వేళలు ఇలా..
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 6, 7 తరగతులకు ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి 11:45 గంటల వరకు నిర్వహించనున్నారు. 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. వాటిలో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పేపర్ పరీక్షలు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు నిర్వహిస్తారు.
ప్రశ్నపత్రాలు మండలాలకు..
హనుమకొండ జిల్లాలో విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీసీఈబీ (జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు )నుంచి ఆయా తరగతుల ప్రశ్నపత్రాలు మండల కేంద్రాలకు పంపిణీ చేశారని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, డీసీఈబీ సెక్రటరీ బి.డాక్టర్ బి.రాంధన్ తెలిపారు. మండల కేంద్రాలల్లోని కస్టోడియన్ల నుంచి హెడ్మాస్టర్లకు ప్రశ్నపత్రాలు అందజేస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లోని 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు అదేవిధంగా యాజమాన్యాల పరిధి పాఠశాలల్లోని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖలోని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ప్రశ్నపత్రాలు అందజేస్తోంది. డీసీఈబీ అందజేసిన ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈపరీక్షల పర్యవేక్షణకు కస్టోడియన్లు మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా కో–ఆర్డినేటర్లు, గజిటెడ్ స్థాయి డీసీఈబీ సభ్యులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
ఎప్పటికప్పుడు మూల్యాంకనం..
ఆయా పరీక్షలు సబ్జెక్టుల వారీగా నిర్వహించిన రోజునే సంబంధిత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఆయా మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈనెల 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ప్రగతి పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 24నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి. ఎస్ఏ–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, హనుకొండ జిల్లా డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ హెచ్ఎంలను ఆదేశించారు.
రేపటి నుంచి విద్యార్థులకు
ఎస్ఏ–2 పరీక్షలు
ఏర్పాట్లు చేసిన అధికారులు


