రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం భూపాలపల్లి సీఐ నరేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కుర్రే చేరాలు (55)కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో చేరాలు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో కుటుంబంలో విభేదాలు ఏర్పడి తరచూ గొడవలు జరిగేవి. కాగా, చేరాలు తన భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో పని నిమిత్తం వారం రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడు. కానీ తిరిగి హైదరాబాద్కు వెళ్లకపోవడంతోపాటు ఫోన్లో స్పందించకపోవడంతో ఇద్దరు కుమారులు రామ్, లక్ష్మణ్ రేపాకకు చేరుకున్నారు. ఈ సమయంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంట్లో తండ్రి ఉండడాన్ని చూసి గొడ్డితో దాడికి పాల్పడి పరారయ్యాయి. తీవ్రంగా గాయపడిన చేరాలను స్థానికులు గమనిచి 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారి వద్ద నుంచి గొడ్డలి, ద్విచక్రవాహనం, 25 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై సుధాకర్, సిబ్బందిని సీఐ నరేశ్కుమార్ అభినందించారు.
వివరాలు వెల్లడించిన పోలీసులు


