మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా అమరులైన ఉద్యమకారులు దేశెట్టి రామచంద్రయ్య, బాదరబోయిన రాఘవులు, తూము వెంకన్న, గుంజే హన్మంతు, భూక్య సత్యనారాయణకు నివాళులర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, జర్నలిస్టు, కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారన్నారు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగులకు పింఛన్తో పాటు ఉద్యమ గుర్తింపు కార్డులు, మెడికల్ కార్డులు తక్షణమే అమలు చేయాలన్నారు. రాబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందే ఉద్యమకారుల హామీలను అమలు చేయాలని కోరారు. లేని యెడల భవిష్యత్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ పిల్లి సుధాకర్, నియోజకవర్గాలు, మండలాల కన్వీనర్లు మేక సురేష్రెడ్డి, శంతన్రామరాజు, ఫరీద్, పరకాల రవీందర్, కృష్ణమూర్తి, గుగ్గిళ్ల పీరయ్య, రవికుమార్, లాలయ్య, రవి, కిషన్, దస్రునాయక్, లింగన్న, పాపన్న, దేవేందర్, వెంకన్న, అంబరీష, ఇమామ్, వెంకటేశ్వర్లు, సాయి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


