
బస్సు సౌకర్యం కల్పించాలి
నెహ్రూసెంటర్: ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, అదనపు సర్వీసులను పెంచాలని ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమానికి ప్రజలు, ప్రయాణికులు ఫోన్ ద్వారా వినతులను సమర్పించారు. మానుకోట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి 14 వినతులు వచ్చినట్లు డీఎం ఎం.శివప్రసాద్ తెలిపారు. మహబూబాబాద్–సింగారం–మునిగలవీడు, మహబూబాబాద్–మట్టెవాడ–గూడూరు, మహబూబాబాద్–మరిపెడ–రాంపూర్–హైదరాబాద్, మరిపెడ–చిన్నగూడూరు సర్వీసులను నడిపించాలని ప్రయాణికులు కోరినట్లు తెలిపారు. మరిపెడ బస్టాండ్ ప్రాంగణంలో సమయపాలన సూచిక ఏర్పాటు చేయాలని పలువురు కోరినట్లు డీఎం తెలిపారు. సదరు రూట్లను పరిశీలించి ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడిపిస్తామని డీఎం వెల్లడించారు.