
జిల్లాలో వేర్వేరు చోట్ల విద్యుత్ ప్రమాదాలు
మ్యారేజ్ డే మరుసటిరోజే వ్యక్తి మృతి
ఒకరి మృత్యువాత..
మరొకరికి తీవ్రగాయాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇనుగుర్తి వాసి
నెహ్రూసెంటర్: భర్త మరణం భార్యకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివాహ వార్షికోత్సవం తర్వాత రోజే విద్యుత్ ప్రమాదరూపంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబ విషాదంలో మునిగిపోయింది. మరోచోట కరెంట్ షాక్తో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న క్రాంతికుమార్ (32) ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తూ శనివారం విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు తీసుకురాగా అప్పటికే మృతిచెందాడు. క్రాంతికుమార్ మృతితో భార్య, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.
సంతోషం.. మరునాడే విషాదం
మృతుడు క్రాంతికుమార్ దంపతులు శుక్రవారం పెళ్లిరోజు వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాంత్రి మరుసటి రోజే మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తమను సంతోషంగా చూసుకుంటాడనుకున్న భర్త మృతితో భార్య రోదనలు మిన్నంటాయి.
ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...
క్రాంతికుమార్కు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నేడు అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటుండగా చిన్నారులకు మాత్రం కన్నతండ్రి దూరమైన పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆ చిన్నారులు తమ తండ్రి చనిపోయిన విషయాన్ని సైతం తెలుసుకునే వయస్సులో లేకపోవడం కలిచివేస్తుంది.
ఇనుగుర్తిలో ఘటన...
జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డోర్నకల్లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇనుగుర్తి శివారు వీరారెడ్డిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అదే గ్రామానికి చెందిన బూర్గుల అంబేడ్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లో ఆస్పత్రికి తరలించారు.