
భూమికి పరిహారం చెల్లించాలని..
కురవి: తన భూమికి పూర్తి పరిహారం చెల్లించకుండా గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చేస్తున్నారని మహబూ బాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో రైతు నూకల రవి పురుగుల మందు డబ్బా పట్టుకుని హైవే రోడ్డు కోసం పక్కన నిర్మించిన విద్యుత్ స్తంభం(టవర్) ఎక్కాడు. పూర్తి పరిహారం చెల్లించే వరకు దిగేది లేదని, పురుగుల మందు తాగి టవర్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. తన 1.34 ఎకరాల భూమి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ చేశారని, 1.12 ఎకరాలకు నష్టపరిహారం కింద రూ.14లక్షలు చెల్లించారని, ఇంకా 22 గుంటల భూమికి పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఎస్సై వెంకన్న, ఆర్ఐ రవి సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్తంభం ఎక్కిన రైతుతో మాట్లాడారు. ఎంతచెప్పినా వినకుండా కిందికి దూకుతానని అనడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే సమయంలో టవర్ కింద రైతు తల్లి ఉప్పలమ్మ, భార్య రజిత, కొడుకు వంశీకృష్ణలు ఆందోళనకు దిగారు. చివరికి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కురవి సబ్ డివిజన్ నాయకుడు సామ పాపయ్య సంఘటన స్థలానికి వచ్చి పరిహారం అందే వరకు నీ తరఫున పోరాటం చేస్తామని చెప్పడంతో టవర్ దిగాడు. మళ్లీ లారీల్లో మట్టి తీసుకొచ్చి పనులు చేస్తుండడంతో రవి ఆ వాహనం ఎదుట బైఠాయించాడు. భూమిలో పనులు చేయొద్దని కాంట్రాక్టర్కు చెప్పడంతోపాటు పూర్తిస్థాయి అందేలా సాయం చేస్తానని రవికి ఆర్ఐ రవికుమార్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కాగా, ఈ విషయమై ఆర్ఐ రవికుమార్ వివరణ కోరగా నూకల రవికి సంబంధించిన బంధువు(పెద్దభార్య కొడుకు) తన కు వాటా కావాలని, పరిహారం చెల్లించాలని మహబూబాబాద్ కోర్టును ఆశ్రయించాడని, అందుకే పరిహారం అందడంలో ఆలస్యం అవుతుందని వివరించాడు.
పురుగుల మందు డబ్బాతో
విద్యుత్స్తంభం ఎక్కి రైతు హల్చల్

భూమికి పరిహారం చెల్లించాలని..