
ఏటీఎం అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
జనగామ: ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, డబ్బులు డ్రా చేసుకుంటున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన జనగామ పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానిక పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఇనుమెల్ల గ్రామానికి చెందిన ముల్లముడి వెంకటకోటేశ్వరావు ఓ కంపెనీలో ఆఫీస్బాయ్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ నష్టపోయి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి.. దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఏటీఎంల నుంచి సులువుగా డబ్బులు ఎలా డ్రా చేయొచ్చని యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న వెంకటకోటేశ్వరావు ప్రజలు ఏటీఎం వద్దకు వచ్చి డబ్బులు డ్రా చేసుకునే క్రమంలో వారిని మాటల్లో పెట్టి కార్డు మార్చి డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు డ్రా చేసుకుని నల్లగొండ, సంగారెడ్డి, పరకాల జైలులో కొంతకాలం శిక్ష అనుభవించాడు. ఈక్రమంలో జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చుపహాడ్ శివారు సూర్యబండ తండాకు చెందిన భూక్యా భాస్కర్ ఏటీఎం వద్ద గుర్తు తెలి యని వ్యక్తి ఏమార్చి డబ్బులు కాజేసినట్లు ఫిర్యాదు చేయడంతో.. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏఎస్పీ, సీఐ దామోదర్రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై భరత్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏటీఎంల వద్ద పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో బస్టాండ్ రోడ్డు వైన్స్ సమీపంలోని ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వెంకట కోటేశ్వరరావును ఎస్సై భరత్ అదుపులోకి తీసుకుని విచారించగా, ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు కర్ణాకర్, సాగర్, మహేందర్, సల్మాన్లను సీపీ అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ
పండేరి చేతన్ నితిన్