
కమిషన్ ఎదుట అబద్ధాలు చెప్పిన కేసీఆర్
నెహ్రూసెంటర్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెప్పారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లేలా చేసిన బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని తానై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్లు చెప్పుకున్న కేసీఆర్.. కూలిపోతుందని తెలియగానే అధికారులు, ఇంజనీర్లదే తప్పదమంటూ చెబుతున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ఎకరాకు కూడా నీటిని అందించలేదని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, నాటి మంత్రులు అబద్ధాలు చెప్పి తప్పించుకోలేరన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయక గిరిజనులను కాల్చి చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోలు తమ పంథా మార్చుకుని తుపాకులను వదిలేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొట్లాడాలని హితవుపలికారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. విద్యశాఖపై సమీక్షలు నిర్వహించాలని, విద్యశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలన్నారు. జూలై 5, 6 తేదీల్లో జరగనున్న సీపీఐ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి పిలుపునిచ్చారు. 5న బహిరంగ సభ ఉంటుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని సూచించారు. అనంతరం మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు బి.అజయ్సారథిరెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పెరుగు కు మార్, నవీన్, వెంకన్న, వరిపెల్లి వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, నెల్లూరు నాగేశ్వర్రావు, కట్లోజు పాండురంగాచారి పాల్గొన్నారు.