
మరిన్ని పీఎంశ్రీ స్కూళ్ల ఎంపికకు కృషి
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరిన్ని పీఎంశ్రీ స్కూళ్ల ఎంపికకు తనవంతు కృషిచేస్తానని ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన విద్యాసంవత్సరం పాఠశాలల పున:ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పోటీపరీక్షల ద్వారానే నియమితులవుతారన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే సర్కారు బడులు జ్ఞానకర్మాగారాలుగా మారుతాయన్నారు.ఉపాధాయులు నిత్యవిద్యార్థిగా ఉంటూ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కృత్రిమ మేధతో తరగతి గదుల అనుసంధానం డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారని విద్యాబోధన పద్ధతుల్లో నవీనప్రక్రియలను చేపడుతోందన్నారు. ఈవిద్యాసంవత్సరంలో 135 పాఠశాలల్లో కృత్రిమ మేధ తరగతులను,16 పాఠశాలల్లో పూర్వప్రాథమిక తరగతులను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. డీఈఓ డి. వాసంతి మాట్లాడుతూ బడి బాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఎంఈఓ బి. మ నోజ్కుమార్, ఆ పాఠశాల హెచ్ఎం జి. ఉప్పల య్య, రిటైర్డ్ హెచ్ఎం బి. రాధ, పర్యావరణ పరిరక్షణ సమితి బాధ్యులు, రిటైర్డ్ డీఎఫ్ఓ కాజిపేట పురుషోత్తం, అశోక్బాబు, ప్రేరణ ఫౌండేషన్ అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య