
పెళ్లికి అడ్డుగా మారిన వరుస..
బయ్యారం: ప్రేమికురాలితో కడదాకా జీవిద్దామనుకుంటే వరుస అడ్డురావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ ప్రేమికుడు బలవన్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కాపువారిగూడెం గ్రామానికి చెందిన పానుగోత్ దేవీలాల్(34) మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో నీటిపారుదలశాఖ ఏఈఈ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత అక్టోబర్లో మొ దటి పోస్టింగ్ పొందిన దేవీలాల్.. గార్లలో విధులు నిర్వర్తిస్త్తూ బయ్యారంలో అద్దెకుంటున్నాడు.
పెళ్లికి యువతి నిరాకరణ..
దేవీలాల్కు ఉద్యోగం రాకముందు పది సంవత్సరాలుగా తన తండాకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి వరుసకు కూతురు అవుతుండడంతో పెళ్లికి అభ్యంతరాలొచ్చాయి. దీంతో మనస్తాపం చెంది మొదటిసారి ఆత్మహత్యాయత్నం చేసుకోగా కాలు కోల్పోయాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగం సాధించినా ఆ యువతిని మరవలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో దేవీలాల్కు పెళ్లి చేసేందుకు కుటుంబీకులు సంబంధాలు చూస్తున్నారు. అయితే తాను ప్రేమించిన యువతితో పెళ్లి అయ్యే పరిస్థితి లేకపోవడంతో కొన్ని రోజులుగా డిప్రెషన్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగే ముందు చివరి ప్రయత్నంగా బుధవారం ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడాడు. అయితే వరుస కుదరని ఆ యువతి తెలపడంతో పురుగుల మందు తాగాడు. అనంతరం ఈ విషయాన్ని తమ కార్యాలయంలో పనిచేసే అటెండర్ కుమారుడికి ఫోన్లో తెలిపాడు. వెంటనే దేవీలాల్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి తండ్రి మంగ్త్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి గురువారం తెలిపారు.
కూతురు వరుస కావడంతో పెళ్లికి అభ్యంతరం చెప్పిన యువతి
వేరే సంబంధాలు చూస్తుండగా
మనస్తాపంతో ఏఈఈ ఆత్మహత్య