
చిత్రకళా ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఆడెపు రజనీకాంత్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ గూగుల్ రజనీకాంత్ ప్రతిభను గుర్తించి వికీపిడియాలో చోటు ఇచ్చింది. అంతర్జాతీయంగా, జాతీయంగా విభిన్న రంగాల్లో రాణిస్తూ ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలు చేసే వారిని గుర్తించి గూగల్ వికీపిడియాలో సమాచారం పొందుపరుస్తారు. రజనీకాంత్ సూక్ష్మకళలో అంతర్జాతీయంగా రాణిస్తూ సుమారు 100కు పైగా విభిన్న ఆకృతుల్లో సూక్ష్మ కళాఖండాలను రూపొందించారు. ఇందుకు గాను ఆర్హెచ్ఆర్ వరల్డ్ రికార్డు, రికార్డు హోల్డర్ రిపబ్లిక్ ఇండియా రికార్డు, రెండు బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులు, తెలుగుబుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, సృజనపుత్ర అవార్డు, ఉత్తమ కళారత్న అవార్డు, గ్రామీణ కళాజ్యోతి అవార్డు, ఉత్తమ కళాకారుడి అవార్డులు అందుకున్నారు. రెండు బియ్యపు గింజలపై 278 అక్షరాలను, జాతీయగీతం జనగణమన, జాతీయగేయం వందేమాతరం రూపొందించారు. అంతేకాకుండా రజనీకాంత్ గుండుపిన్ను సహాయంతో పెన్సిల్ గ్రాఫైట్పై ప్రపంచంలో అతి సూక్ష్మ ఎత్తుకలిగిన గణపతి విగ్రహాన్ని రూపొందించడంతోపాటు చాక్పీస్లపై 78 జాతీయజెండాలను, 109 శివలింగాలను తయారు చేశారు. రజనీకాంత్ ప్రతిభను గుర్తించి పూర్తి సమాచారం సేకరించి వికీపిడియాలో పొందుపర్చినట్లు వికీపిడియా సమాచార సేకరణకర్త ఆత్రపు మోతీరామ్ తెలిపారు.
గూగుల్ వికీపిడియాలో రజనీకాంత్కు చోటు

చిత్రకళా ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం