
రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలి
హన్మకొండ: రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ జీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీ పరిధిలోని 16 సర్కిళ్లలో పూర్తి స్థాయిలో రెవెన్యూ వసూళ్లు చేయాలని ఆదేశించారు. విధిగా నోడల్ జీఎంలు తమ పరిధిలోని సర్కిళ్లలో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ ఆపరేటర్లు చిందరవందరగా తీగలు అమర్చుతున్నారని, వీటిపై సర్వే నిర్వహించాలని ఆదేశించారు. పోల్ రెంటల్ విధిగా గ్రామాల్లో రూ.15, పట్టణం, నగరాల్లో రూ.20 చొప్పున వసూలు చేయాలన్నారు. సర్కిళ్లలో కాలిన, పనిచేయని మీటర్లను వెంటనే మార్చాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్లాల్, వి.తిరుపతి రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, జనరల్ మేనేజర్లు వేణు బాబు, కృష్ణ మోహన్, వెంకట కృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, సురేందర్, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి