
అప్పు తీసుకుని ఇవ్వడం లేదని..
ములుగు రూరల్: పైసాపైసా కూడబెట్టిన రూ. 3లక్షలను వ్యాపారి అప్పుగా తీసుకుని ఇవ్వడం లేదనే కారణంతో ఓ వ్యక్తి మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని అబ్బాపూర్లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాదె రాజు (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారికి పైసాపైసా కూడబెట్టిన రూ. 3 లక్షలను మూడు సంవత్సరాల క్రితం అప్పుగా ఇచ్చాడు. అయితే సంవత్సరం నుంచి అప్పు చెల్లించాలని పలుమార్లు అడుగుతున్నా సదరు వ్యాపారి చెల్లించకపోవడంతో రాజు దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వడ్డీ ఇవ్వకున్నా అసలు డబ్బు అయిన ఇవ్వాలని ప్రాధేయపడినా సదరు వ్యాపారి ఇవ్వకపోవడంతో రాజు మంగళవారం రాత్రి వ్యాపారి బిల్డింగ్పై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు బుధవారం ఉదయం గమనించి పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలికి చేరుకుని రాజు మృతికి గల వివరాలు తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
అబ్బాపూర్లో ఘటన