
గ్రీన్ఫీల్డ్ హైవే పనుల వద్ద రైతుల ఆందోళన
నెల్లికుదురు: గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆందోళనకు దిగిన ఘటన మండలంలోని నర్సింహులగూడెంలో బుధవారం జరిగింది. బాధిత రైతుల వివరాల ప్రకారం.. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులతో గతంలో ఉన్న రోడ్డును ధ్వంసం చేశారని, వ్యవసాయ భూముల వద్దకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు, కలెక్టర్ కార్యాలయంలో విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతనే గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని రైతులు హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు పొన్నం వెంకన్న, రామస్వామి, సోమయ్య, నర్సయ్య, నరేశ్, సుధాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.