
అందమైన బడి.. యూపీఎస్ బ్రాహ్మణపల్లి
● ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన
● రాష్ట్ర స్థాయిలో అవార్డులు సొంతం
● పునఃప్రారంభానికి సిద్ధం
సాక్షి, మహబూబాబాద్: కృషి, పట్టుదల ఉంటే మట్టిలో మాణిక్యాలను వెలికితీయవచ్చు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని, గ్రామస్తుల సహకారం తీసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. అంకితభావం తోడైతే.. అవార్డులు సొంతం చేసుకోవచ్చు అనడానికి మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులను పంపించకుండా కట్టడి చేశారు. ఇందుకోసం తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేస్తున్నారు. కాగా పాఠశాల నేడు పునఃప్రారంభం కానుండగా.. బడిని అందంగా ముస్తాబు చేశారు.
ప్రవేశాలకు పోటీ..
పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 110 మంది విద్యార్థులు, తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా బడిని అందంగా తీర్చిదిద్దేందుకు గ్రామ మాజీ సర్పంచ్ షఫియోద్దిన్, ఇతర గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు. రూ.1.50లక్షలతో పాఠశాలలో అందమైన మొక్కలు నాటారు. ప్రధాన గేటు నుంచి పాఠశాల లోపలి వరకు ట్రాక్ నిర్మించి ఇరువైపులా మొక్కలు నాటారు. దీంతో పాఠశాలకు అందం వచ్చింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన సాగుతోంది. కాగా మూడు సార్లు ఇన్స్పైర్లో రాష్ట్ర స్థాయి అవార్డులు, జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డును కై వసం చేసుకుంది. బడి బాట కార్యక్రమంలో ప్రత్యేకతలు చాటుతూ తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు. ఈ ఏడాది చుట్ట్టూ పక్కల ఉన్న గ్రామాలు, తండాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు పోటీ పడుతున్నారు.