
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
మరిపెడ రూరల్: పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించడంతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక పంట దిగుబడులు సాధించాలని డీఏఓ విజయ నిర్మల రైతులకు సూచించారు. బుధవారం మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించడంతో పాటు పంట మార్పిడి చేపట్టాలన్నారు. అడువులు, బీడు భూముల్లో మొక్కలు పెంచడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు వాతావరణ సమతుల్యత ఉంటుందన్నారు. ప్రభుత్వం నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలను రైతులు సాగు చేయవద్దని, సాగు చేసిన వారు శిక్షార్హులు అవుతారని ఆమె హెచ్చరించారు. ఏడీఏ విజయ్చంద్ర, శాస్త్రవేత్తలు బి.క్రాంతికుమార్, ఈ.రాంబాబు, ఏఓ బోడ వీరసింగ్, ఏఈఓ సాయి శృతి, రైతులు అశోక్రెడ్డి, సందు అశోక్, జర్పుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విశిష్ట గుర్తింపు కార్డులు తీసుకోవాలి
మహబూబాబాద్ రూరల్: రైతులు తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు కార్డులు తీసుకోవాలని డీఏఓ ఎం.విజయనిర్మల బుధవారం తెలిపారు. జిల్లాలో 1,80,227 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 43,393 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంకా 1,36,834 మంది రైతులు విశిష్ట గుర్తింపు కార్డులు తీసుకోవాల్సి ఉందని, ఈ నెల చివరి వరకు మిగిలిన రైతులు తీసుకోవాలని సూచించారు.