
ప్రత్యేకాధికారుల బడి బాట
సాక్షి, మహబూబాబాద్: వేసవి సెలవుల అనంతరంగురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇన్నిరోజులు జన సంచారం లేక అస్తవ్యస్తంగా మారిని పాఠశాలల్లో ప్రారంభం నాటికి అన్ని వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం, పండుగను తలపించే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం ఉదయం ఆదేశించడంతో మండల ప్రత్యేకాధికారులు బడి బాట పట్టారు. పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రత్యేకాధికారితో టీమ్
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్న నేపథ్యంలో జిల్లా అధికారుల దృష్టి విద్యాశాఖపై పడింది. ఇప్పటికే ఐదు రోజులుగా ఉపాధ్యాయులు బడి బాట పేరుతో విద్యార్థులను బడిలో చేర్పించే పనిలో ఉన్నారు. అయితే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించేందుకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పర్యవేక్షణ కోసం ఇప్పటికే ప్రతీ మండలానికి జిల్లా అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించారు. ఇప్పుడు ఆ అధికారికి తోడుగా తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓతో కలిసి టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి బడి తెరిచే నాటికి సర్వం సిద్ధం చేయనున్నారు.
ప్రధాన సమస్యలు..
సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల గేట్లకు తాళాలు వేశారు. దీంతో పాఠశాల ఆవరణ పిచ్చిమొక్కలతో అపరిశుభ్రంగా తయారైంది. దీంతోపాటు తరగతి గదుల్లో దుమ్ము, ధూళి చేరింది. పలు పాఠశాలలకు సరైన గేట్లు లేకపోవడంతో ఆకతాయిలు వెళ్లి తాగునీటి పైపులైన్లు విరగకొట్టడం, ఫ్యాన్లు, లైట్లు తీసివేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యేకాధికారితో కూడిన టీమ్ పాఠశాలలకు వెళ్తోంది. మంగళ, బుధవారాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడడం, ఆవరణలోని పిచ్చి మొక్కలు తీసేసి శుభ్రం చేయడం, మామిడాకుల తోరణాలు కట్టి పండుగ వాతావరణంలో పిల్లలకు స్వాగతం పలికేలా సర్వం సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
బడులు తెరిచే నాటికి సర్వం సిద్ధం చేసే పనిలో నిమగ్నం
మండల ప్రత్యేకాధికారితో బృందం
అన్ని పాఠశాలలకు వెళ్తున్న సభ్యులు