
సమస్యల అంతానికి పరిశోధనే ఆయుధం
కేయూ క్యాంపస్: సామాజిక సమస్యల పరిష్కారానికి పరిశోధనే ఆయుధమని, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలపై దృష్టిసారించాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి కోరారు. వారం రోజులుగా కేయూలోని పొలిటికల్ స్సైన్స్ విభాగంలో పరిశోధక విద్యార్థులకు పరిశోధనాపద్ధతులపై నిర్వహిస్తున్న అవగాహన తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక శాస్త్రాల పరిశోధన ఎంతో కీలకమన్నారు. పరిశోధనల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన బడ్జెట్,అలాగే పుస్తకాలు అందుబాటులో ఉంచేలా కృషి చేస్తానన్నారు. కేయూ ఎకనామిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్. విజయ మాట్లాడుతూ ఈ ఆధునిక సమాచార యుగంలో మానవుడు సేకరిస్తున్న సమాచారం పరిమితులు లేనిదన్నారు. అయితే సమాచారాన్ని గణనీయంగా ఉపయోగించేందుకు రెండు ముఖ్యమైన పద్ధతులు సహకరిస్తున్నాయన్నారు. కంటెంట్ అనాలిసిస్, డేటా ప్రదర్శన అన్నారు. ఇవి పరిశోధన, విద్యమాధ్యమం, వ్యాపారం వంటి రంగాల్లో ముఖ్యమైన సాధనాలుగా వెలుగొందుతున్నాయన్నారు. సమావేశంలో పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి సంకినేని వెంకటయ్య, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, బీఓఎస్ కృష్ణయ్య, అధ్యాపకులు వడ్లకొండ సత్యనారాయణ, వి. నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి