
స్పెషల్ టూర్ ప్యాకేజీలు
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రయాణికులు, భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలని అందుబాటులోకి తీసుకొచ్చారు. మహబూబాబాద్ నుంచి అతితక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలు, విహార యాత్రలకు సామూహికంగా వెళ్లేందుకు ఆర్టీసీ సౌకర్యం కల్పించింది. మానుకోట ఆర్టీసీ డిపో నుంచి 5రకాల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా ఈ నెల 27వ తేదీ నుంచి ప్యాకేజీని అమలు చేస్తారు. పూర్తి వివరాలకు 99592 26054, 94417 13896 నంబర్లలో సంప్రదించవచ్చు.
మానుకోట నుంచి టూర్ ప్యాకేజీలు..
● మహబూబాబాద్ డిపో నుంచి హనుమకొండ వేయిస్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, ఖిలా వరంగల్ వరకు ఒక్కరోజు టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ. 450 చార్జ్గా నిర్ణయించారు. ఎక్స్ప్రెస్ బస్సు ఉదయం 5 గంటలకు డిపో నుంచి బయలుదేరుతుంది.
● మహబూబాబాద్ నుంచి మల్లూరు–బొగత జలపాతం–లక్నవరం–రామప్పకు ఒక్కరోజు టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ. 650 చార్జ్ వసూలు చేయనున్నారు. ఎక్స్ప్రెస్ బస్సు ఉదయం 4 గంటలకు డిపో నుంచి వెళ్తుంది.
● మహబూబాబాద్ నుంచి హనుమకొండ–వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం–కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయం, గూడెం గట్టు సత్యనారాయణస్వామి దేవాలయం టూర్కు సంబంధించి ఒక్కొక్కరికి రూ.750చార్జ్గా నిర్ణయించారు. డిపో నుంచి రాత్రి 11 గంటలకు ఎక్స్ప్రెస్ బస్సు బయలుదేరుతుంది.
● మహబూబాబాద్ నుంచి సూర్యాపేట, నాగార్జునసాగర్, మాచర్ల చెన్న కేశవస్వామి ఆలయం, శ్రీశైలం రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ. 1,500 చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి 11 గంటలకు డీలక్స్ బస్సు బయలుదేరుతుంది.
● మహబూబాబాద్ నుంచి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షరామం, సామర్లకొటకు రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ.1,500 చార్జ్ వసూలు చేయనున్నారు. డీలక్స్ బస్సు రాత్రి 10 గంటలకు టూరిస్టులతో వెళ్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ ఆర్టీసీ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకువచ్చిన విహార యాత్ర, పుణ్యక్షేత్రాల ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రయాణికులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశఽం. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీని వినియోగించుకోవాలి. ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానున్న ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– శివప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజర్
మానుకోట నుంచి పుణ్యక్షేత్రాలు,
యాత్రలకు ఆర్టీసీ సర్వీసులు
ఈ నెల 27 నుంచి అమలు

స్పెషల్ టూర్ ప్యాకేజీలు