టిప్పర్‌ ఢీకొని బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని బాలిక మృతి

Jun 9 2025 7:46 AM | Updated on Jun 9 2025 7:46 AM

టిప్పర్‌ ఢీకొని  బాలిక మృతి

టిప్పర్‌ ఢీకొని బాలిక మృతి

పెద్దవంగర: ఈ లోకంలో ఆనందమంతా తనదే అన్నట్టు అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆడుకుందా చిన్నారి. సరదాగా సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిన బాలికను టిప్పర్‌ రూపంలో మృత్యువు బలిగొంది. రెక్కల కష్టంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురుకి పదకొండేళ్లకే నూరేళ్లు నిండడంతో కన్నపేగు కన్నీటి పర్యంతమైంది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై క్రాంతి కిరణ్‌, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం బావోజీతండా గ్రామ పంచాయతీ పరిధి కిష్టుతండాకు చెందిన జాటోతు అనిత–సోమన్న దంపతులకు ఇందుమతి(11), దీక్షిత్‌ ఇద్దరు సంతానం. ఇందుమతి ఐదో తరగతి పూర్తికాగా వేసవి సెలవులు కావడంతో ఇంటివద్దనే తమ్ముడితో ఉంటున్నది. తండ్రి ట్రాక్టర్‌ డైవర్‌గా పని నిమిత్తం వెళ్లగా.. తల్లి తమకు ఉన్న కొద్ది పాటి వ్యవసాయ పనులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇందుమతి ఆడుకుంటూ సైకిల్‌ తొక్కేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తండా సమీపాన ఉన్న నేషనల్‌ హైవే 930పీ పక్కనే నిర్మాణంలో ఉన్న సర్వీస్‌ రోడ్డు మీదుగా దుర్గామాత ఆలయం వద్దకు సైకిల్‌పై వెళ్తుండగా రోడ్డు నిర్మాణ పనుల కోసం వెళ్తున్న టిప్పర్‌ వెనుక నుంచి బలంగా ఢీకొటింది. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో ఇందుమతి అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై క్రాంతి కిరణ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement