
తెలుగు వెలుగులు సాకారమయ్యేనా?
● ఈ విద్యాసంవత్సరం నుంచే సీబీఎస్ఈ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి చేస్తామన్న సీఎం ● ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అన్ని రకాల స్కూళ్లలో అమలుకు ఆదేశాలు ● పక్కాగా అమలుకు వెంటనే మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న టీచర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలుగుకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అన్ని రకాల సిలబస్ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో తెలుగు మీడియంలో చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించినవారు ఎందరో ఉన్నా, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ మీడి యానికి ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో తెలుగు ప్రాధాన్యం తగ్గిపోతోంది. అయితే మాతృభాషలో చేసే వ్యక్తీకరణ మరే ఇతర భాషల్లోనూ రాదన్నది భాషా నిపుణుల అభిప్రాయం. ఐదో తరగతి వరకు మాతృ భాషలో బోధన ఉండాలని, 8వ తరగతి వరకు ఉంటే మరింత మేలని నూతన విద్యా విధానం చెబుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని రకాల సిలబస్ స్కూళ్లలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తామని ఆ దిశగా చర్యలు చేపడతామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి సిలబస్ కలిగిన స్కూళ్లలోనూ అమలు చేయాలని స్పష్టం చేశారు. అయితే ఈనెల 12 నుంచే పాఠశా లలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది.
గతంలో ఉత్తర్వులు జారీ చేసినా..
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని తెలంగాణ (కంపల్సరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ తెలుగు ఇన్ స్కూల్స్) యాక్ట్ 2018ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అదే ఏడాది జూన్ 30వ తేదీన దశల వారీగా తెలుగు అమలు కోసం జీవో 24ను కూడా జారీ చేసింది. అయినా రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా పక్కాగా అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర సిలబస్ కలిగిన కొన్ని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలతోపాటు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఐసీఎస్ఈ), ఇంటర్నేషనల్ బకలరియట్ (ఐబీ) సిలబస్ కలిగిన ఇంటర్నేషనల్ స్కూళ్లు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడం లేదు. రాష్ట్ర సిలబస్ కలిగిన చాలా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, సీబీఎస్ఈ స్కూళ్లు తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా మాత్రమే అమలు చేస్తున్నాయి. తప్పనిసరి కాకపోవడంతో విద్యార్థులు ఎవరూ తెలుగు సబ్జెక్టును పెద్దగా ఎంచుకోవడం లేదు. దీంతో ఆయా స్కూళ్లలో తెలుగు భాష అమలుకు నోచుకోవడం లేదు.
మెజారిటీ స్కూళ్లలో అమలు అంతంతే
ప్రస్తుతం రాష్ట్రంలో 42,901 పాఠశాలలు ఉండగా, అందులో 59,35,927 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం పాఠశాలల్లో 10,741 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 33,93,010 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఆ స్కూళ్లు అన్నింటిలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడం లేదు. కొన్ని స్కూళ్లు అమలు చేస్తుండగా, మరికొన్ని ఆప్షనల్గా అమలు చేస్తున్నాయి. మరోవైపు 533 సీబీఎస్ఈ సిలబస్ కలిగిన స్కూళ్లు ఉండగా, మిగితావి ఐసీఎస్ఈ, ఐబీ సిలబస్ స్కూళ్లు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతం దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల్లోనూ తెలుగు పక్కాగా అమలుకు నోచుకోవడం లేదు.
ఇకనైనా ‘తప్పనిసరి తెలుగు’అమలయ్యేనా
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సిలబస్ కలిగిన పాఠశాలల్లో 9, 10 తరగతులకు సంబంధించిన రాష్ట్రేతర విద్యార్థుల కోసం సింపుల్ తెలుగు పాఠ్య పుస్తకం ‘వెన్నెల’ను సీఎం రేవంత్రెడ్డి గత ఫిబ్రవరి 26వ తేదీన ఆవిష్కరించారు. ఆ సమయంలో అన్ని రకాల సిలబస్ కలిగిన స్కూళ్లలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా 2025–26 విద్యా సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పారు. దానిని ఇప్పుడు ఆచరణలోకి తీసుకురావాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు టీచర్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.