
టీసీలు లేకుండానే అడ్మిషన్లు..
కేయూ క్యాంపస్: పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ ఏ కళాశాలలోనూ వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందినా అంతకుముందు చదివిన విద్యార్హతల సర్టిఫికెట్లతోపాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) లేకుండా విద్యార్థులను చేర్చుకోరు. ఎందుకంటే ఒకే విద్యా సంవత్సరంలో రెండు చోట్ల వేర్వేరు కోర్సులు చదవకుండా నిరోధించేందుకు టీసీ తప్పనిసరిగా ఉంటేనే అడ్మిషన్లు ఇస్తారు. అయితే కేయూలోని విద్యాకళాశాలలో బీఈడీ కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్కోర్సుగా, ఎంఈడీ రెగ్యులర్ కోర్సుగా కొనసాగుతోంది. ఆయా కోర్సుల్లో (2024–2025 )విద్యాసంవత్సంలో అడ్మిషన్లు పొందినవారిలో కొందరు విద్యార్థులు టీసీలు సమర్పించలేదనే విషయాన్ని కొంతకాలం క్రితం ఆ కళాశాలకు ఇన్చార్జ్ (ఎఫ్ఏసి) ప్రిన్సిపాల్ బాధ్యతలను చేపట్టిన ప్రొఫెసర్ మనోహర్ గుర్తించారు. ఎవరైతే విద్యార్థులు టీసీలు సమర్పించకుండానే అడ్మిషన్లు పొందారో వారికి గత మే నెలలో నోటీస్లు జారీచేశారు. వారికి ఇచ్చిన గడువు వరకూ టీసీలు సమర్పించని 11మంది విద్యార్థుల అడ్మిషన్లు ఈనెల 4న రద్దు చేసినట్లు మనోహర్ వెల్లడించారు. ఆ కళాశాలలో ఆయా విద్యార్థుల పేర్లను కూడా నోటీసు బోర్డులో పెట్టామని తెలిపారు. ఇప్పటికే ఆయా విద్యార్థులు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు కూడా రాశారని పేర్కొన్నారు. అడ్మిషన్లు జరిగినప్పుడు ఆ సమయంలో టీసీలు లేని వారు తాము వారం పదిరోజుల్లో సమర్పిస్తామని కూడా లేఖ కళాశాలలో సమర్పిస్తారు. ఒక వేళ వారు ఆ తర్వాత సమర్పించకపోతే కూడా ప్రిన్సిపాల్ ఆయా విద్యార్థులను అడగాల్సింటుంది. విద్యా కళాశాలలో గతంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వర్తించిన ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎందుకు పట్టించుకోలేదనే అంశం ఇప్పుడు ప్రశ్నతలెత్తుతోంది. టీసీలను సమర్పించని విద్యార్థులను మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎలా అనుమతించారనే అంశం ప్రస్తుత ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మనోహర్ లేవనెత్తుతున్నారు. టీసీలు సమర్పించని విద్యార్థుల అడ్మిషన్ల రద్దుచేయడమేగాకుండా అప్పటి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్పై కూడా చర్యలు తీసుకునే అవకాశంలేకపోలేదని సమాచారం. యూనివర్సిటీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లనున్నారని సమాచారం.
బీపీఈడీలో నలుగురికి, ఎంపీఈడీలో ఆరుగురికి నోటీసులు
కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బీపీఈడీకోర్సులో నలుగురు, ఎంపీఈడీ కోర్సులో ఆరుగురు విద్యార్థులు మొత్తం 10మంది ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ( టీసీలు) సమర్పించకుండానే (2024–2025 )విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందారనే విషయాన్ని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మనోహర్ గుర్తించారు. తాను బాధ్యతలు చేపట్టాక ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో అడ్మిషన్లకు సంబంధించిన విద్యార్థుల జాబితా పరి శీలించారు. అందులో 10మంది విద్యార్థులు టీసీ లు సమర్పించలేదని గుర్తించారు. ఇప్పటికే ఆయా విద్యార్థులు మొదటి సెమిస్టర్ పరీక్షలు కూడా రాశారు. ఆయా 10 మంది విద్యార్థులకు ఈనెల 6న నోటీసులు జారీచేసినట్లు మనోహర్ తెలిపా రు. ఈనెల 16వతేదీవరకు టీసీలు సమర్పించా లని గడువును విధిస్తూ ఆ నోటీసులో పేర్కొన్నా రు. వారికి ఇచ్చిన గడువు వరకు టీసీలు సమర్పించని విద్యార్థుల అడ్మిషన్లు రద్దుచేస్తామని కూడా మనోహర్ తెలిపారు. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కా లేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా కొంతకాలంపాటు ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధ్యతలు నిర్వర్తించారు. టీసీలు సమర్పించని విద్యార్థులను ఎలా మొదటి సెమి స్టర్ పరీక్షలకు అనుమతించారనేది కూడా ప్రశ్నతలెత్తుతుంది.ఆయా విద్యార్థులు టీసీలు సమర్పిస్తారా లేదా అనే అంశం ఈనెల16వ తేదీ వరకు తెలియనుంది.
మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన
విద్యార్థులు
బీఈడీ, ఎంఈడీలో కలిపి 11మంది అడ్మిషన్లు రద్దు
బీపీఈడీ, ఎంపీఈడీలో కలిపి
10 మందికి నోటీసులు