
మదర్ డెయిరీ మనుగడ ప్రశ్నార్థకం!
నష్టాల ఊబిలో సంస్థ
● బిల్లులు అందక 25 వేల మంది పాడి రైతుల్లో ఆందోళన ● సీఎం రేవంత్రెడ్డి చొరవ చూపాలని విన్నపం
ఆలేరు: మదర్ డెయిరీ (నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూ నియన్ లిమిటెడ్–నార్ముల్) భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా అంచున నిలబడింది. పాడి రైతులకు బకాయిలు చెల్లించలేని దీనస్థితి. శుక్రవారం ఆలేరు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. మదర్డెయిరీకి చేయూతపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఉద్యోగులు, రైతులు పెట్టుకున్న కాస్తోకూస్తో ఆశలు ఆవిరయ్యాయి.
రైతులకు బకాయిలు ఇలా..
ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మద ర్ డెయిరీ కింద పాల ఉత్పత్తిదారుల సంఘాలు గుర్తింపు పొందినవి 300 ఉండగా.. ఓటు హక్కు లేని సభ్యులున్న సంఘాలు మరో 150 ఉన్నాయి. రైతుల వద్ద సేకరించిన పాలు రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 23 పాల శీతలీకరణ కేంద్రాలకు వస్తాయి. ఆయా సంఘాల పరిధిలోని 25వేల మంది పాడి రైతులకు ఐదు బిల్లులకు సంబంధించి సుమారు రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అప్పులు, వడ్డీలు ఇవీ..
చిట్యాల వద్ద మదర్ డెయిరీకి సుమారు 30 ఎకరాల భూమి ఉంది. ఆ స్థలంపై గడిచిన కొన్నేళ్లుగా రూ.35 కోట్ల వరకు రుణం(ఓడీ) తీసుకున్నారు. ఇందుకు నెలకు రూ.45 లక్షల వడ్డీ చెల్లిస్తున్నారు. ఇక 600 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు జీతాలు చెల్లిస్తున్నారు. ఇతరత్రా నిర్వహణ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి.
పడిపోయిన సేల్స్..
గత రెండేళ్లగా మదర్ డెయిరీ రైతుల నుంచి సేకరించిన పాలకు, విక్రయాలకు మధ్య చాలా తేడా ఉంది. సుమారు రోజుకు లక్ష లీటర్ల పాలు సేకరిస్తే... 60వేల లీటర్లు మాత్రమే సేల్స్ ఉంటున్నాయి. దాదాపు 40వేల లీటర్ల పాలను పౌడర్గా చేయడం, స్కిన్ మిల్క్ రూపంలో బయట విక్రయించాల్సిన పరిస్థితి. దాంతో లీటర్కు రూ.6 చొప్పున సంస్థ నష్టపోయింది. దీనికితోడు ప్రైవేట్ డెయిరీలతో సవాళ్లు ఎదురవుతున్నాయి. జీతాలు కూడా ఆలస్యమవుతున్నాయని, ఏప్రిల్ నెల జీతం జూన్లో చెల్లించారని ఓ ఉద్యోగి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.
రూ. 80 కోట్ల నష్టాల్లో ఉంది
నేను చైర్మన్ అయిన తరువాత బ్యాంకర్లతో మాట్లాడుతూ.. రుణాలను సర్దుబాటు చేస్తూ ఇంత వరకు నెట్టుకొచ్చాను. ప్రస్తుతం బ్యాంకు ఖాతా ఆపరేటింగ్ అవడంలేదు. బ్యాంకర్లు టర్నోవర్ చేయనివ్వడం లేదు. మొత్తం రూ.80 కోట్ల నష్టాల్లో సంస్థ ఉంది. సంస్థను ఆదుకోవడానికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతున్నాం.
–మధుసూదన్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్
డబ్బులు లేవు
25 వేల మంది రైతులకు సుమారు రూ.20 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. చిట్యాలలో ఉన్న 30ఎకరాలు విక్రయించి, రైతులకు బిల్లులు చెల్లించాలని పాలకమండలిలో నిర్ణయించారు. కానీ కొంతమంది డైరెక్టర్ల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
–బి.కృష్ణ, మదర్ డెయిరీ ఎండీ