
ఆర్యూబీలో మురుగు నీరు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మహబూబాబాద్: మానుకోట పట్టణంలోని అండర్ రైల్వే బ్రిడ్జి(ఆర్యూబీ)లో మురుగు నీరు నిల్వతో దుర్గంధం వెదజల్లడంతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు శరీరంపై పడి చర్మ వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఽధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఆర్యూబీపై ఇటీవల రైల్వే మూడో లైన్ పనులు చేపట్టి పూర్తి చేశారు. కానీ ఆ బ్రిడ్జి కింది భాగాన ఉన్న డ్రెయినేజీ నిర్మాణ పనులు రైల్వే అధికారులు పూర్తి చేయలేదు. కాగా, సమీపంలో జిల్లా ప్రధాన ఆస్పత్రికి సంబంధించిన డ్రెయినేజీ మురుగు నీరు ఆ బ్రిడ్జిలో నిల్వ ఉంటుంది. దీంతో మురుగు నీటి దుర్వాసనతో పాటు వాహనదారులు ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ అధికారులు కూడా సమస్యను రైల్వే ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్ప.. ఆచరణలో అమలు చేయడం లేదు. కాగా ఈనెల 9వ తేదీ వరకు ఆపనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు తెలిపినట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.
సీసీ కెమెరాలు..
అలంకారప్రాయం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని మదర్ థెరిస్సా విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొంతకాలం నుంచి పనిచేయకుండా అలంకార ప్రాయంగా మారి దర్శనమిస్తున్నాయి. వాహనాల రాకపోకలు, నేరాల నియంత్రణ, ఇతర కార్యక్రమాల సమాచార సేకరణ నిమిత్తం పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ఏదైనా రోడ్డు ప్రమాదం, చోరీ, ఇతర సంఘటనలు జరిగినప్పుడు సమాచార సేకరణకు తలనొప్పిగా మారుతుండగా.. సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇవికాకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా పనిచేయటంలేదని ప్రజలు, వాహనదారులు పేర్కొన్నారు. పోలీసులు ఏర్పాటు చేయించిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పుటేజీలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు.
వైభవంగా ‘సందల్’ ఊరేగింపు
మహబూబాబాద్ రూరల్: బక్రీద్ పండుగ నేపథ్యంలో సందల్(గంధం), ఖందిల్ ఊరేగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి మానుకోటలో వైభవంగా జరిగింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో సయ్యద్ ఇమాంషావలీ దర్గాలో సమర్పించేందుకు తీసుకెళ్లే సందల్కు ముస్లిం మతపెద్దలు అబ్దుల్ హమీద్, మహ్మద్ సయీద్ అహ్మద్ రిజ్వీ, ఎస్.కే.ఇమ్రాన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్ రావు, డీటీ నాగరాజు, ఆర్ఐలు ప్రవీణ్ కుమార్, విక్రమ్, సీనియర్ అసిస్టెంట్ రహెమాన్, జూనియర్ అసిస్టెంట్ బిస్మిల్లా గంధాన్ని ఇమాంషావలీ దర్గాకు సాగనంపారు. సందల్ ఊరేగింపు సందర్భంగా ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కాగా ఖందిల్తోపాటు రెండు రకాల గంధాన్ని ఈదులపూసపల్లిలోని ఇమాంషావలీ దర్గాలో సోమవారం తెల్లవారుజామున సమర్పించనున్నారు. అదేరోజు ఆ ప్రాంతంలో ఘనంగా ఉర్సు ఉత్సవం జరుగుతుంది. కార్యక్రమంలో ముస్లింలు ఎండి.హారుణ్, జమీల్, ఖలీల్, ఆసిఫ్ అలీ ఫకీర్, ఫరీద్, ఇస్మాయిల్, ఖైసర్, ఫారూఖ్, ఫెరోజ్, ఫయాజ్, యాకూబ్, జిలానీ, వాహెద్, చాంద్, ఎక్బాల్, రెహమాన్, గౌస్, దస్తగిరి, ఖాజాపాషా, వాజీద్పాషా, ఆదిల్, ఈదులపూసపల్లి దర్గా ముతవల్లి అన్వర్, పద్మం ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్యూబీలో మురుగు నీరు

ఆర్యూబీలో మురుగు నీరు