డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్‌ | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్‌

Jun 9 2025 7:45 AM | Updated on Jun 9 2025 7:45 AM

డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్‌

డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్‌

సాక్షి, మహబూబాబాద్‌: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌కు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం లభించింది. ఈమేరకు ఆదివారం జరిగిన పా ర్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రి పదవి కోసం పోటీపడి..

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న రామచంద్రునాయక్‌ 2014లో టీడీపీ నుంచి, 2018లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మాజీమంత్రి డీఎస్‌ రెడ్యానాయక్‌పై 55వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. లంబాడ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రునాయక్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు, పార్టీలోని కీలక నాయకుల ఆశీస్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ సముచితస్థానం కల్పిస్తుందని అందరూ ఊహించారు. మొదటి విడత మంత్రి వర్గం ఏర్పాటులో మంత్రి పదవి కాకుండా, ప్రభుత్వ విప్‌ ఇచ్చి సంతృప్తి పరిచారు. తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, ఈ సారి అవకాశం వస్తుందని చర్చ జరిగింది. ఆదివారం రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ కోసం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశంలో రామచంద్రునాయక్‌కు ఉపసభాపతిగా నియమించేందుకు తీర్మానించారు.

అనుకూలించిన సామాజిక సమీకరణలు

బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో చాలామంది సీనియర్‌ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో అత్యధిక మంది మంత్రి వర్గంలో స్థానం, లేదా మరో కీలక పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. కాగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర కీలక పార్టీ నాయకులు ఎన్నో తర్జనభర్జన చేశారు. ఇందులో భాగంగా సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ, కొత్త మంత్రివర్గంలో అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తూ ముగ్గురికి స్థానం కల్పించారు. లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఈసారి అవకాశం వస్తుందని చర్చ జరిగింది. ఈ విషయంపై పలు లంబాడ, గిరిజన సంఘాల నాయకులు కూడా ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లను కలిసి, వినతి పత్రం అందజేశారు. అయితే మంత్రి పదవి కాకుండా లంబాడ సామాజికవర్గానికి చెందిన రామచంద్రునాయక్‌కు ఉపసభాపతిగా అవకాశం కల్పించారు.

మంత్రి పదవికి ప్రయత్నాలు

ఉప సభాపతి పదవితో సర్దుబాటు

మరింత బాధ్యతతో పని చేస్తా:

రామచంద్రునాయక్‌

పార్టీ పెద్దలకు రుణపడి ఉంటా:

రామచంద్రునాయక్‌

అట్టడుగు వర్గానికి చెందిన తనకు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పిస్తున్న కాంగ్రెస్‌ పా ర్టీ పెద్దలకు, కాంగ్రెస్‌ పార్టీకి రుణపడి ఉంటానని రామచంద్రునాయక్‌ అన్నారు. మ రింత బాధ్యతతో పనిచేసి, పార్టీ ప్రతి ష్టను పెంచుతానన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన డోర్నకల్‌ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement