
దగాపడిన రైతన్న
కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవ పథకం రైతులతో దోబూచులాడుతోంది. పెట్టుబడి కష్టాలతో అల్లాడుతున్న రైతులను కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినా ఆదుకోలేకపోతోంది. ఇప్పటికే ఒక సంవత్సరం పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పినా అన్నదాతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో అర్హత కలిగిన రైతుల సంఖ్యను భారీగా కుదించడం ఆందోళన కలిగిస్తోంది. అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు ఆన్లైన్ ద్వారా గ్రీవెన్స్ అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ చర్యలు నామమాత్రమే. 1418 గ్రీవెన్స్కు దిక్కే లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే అరకొర రుణమాఫీతో మమ అనిపించారు. ఈ సారి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమోనని రైతులు చర్చ జరుగుతోంది.
23,574 మంది రైతులకు మొండిచేయి
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద తాజాగా అర్హత పొందిన రైతుల జాబితాలను విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో పెట్టుబడి సాయానికి అర్హత పొందిన రైతులు 2,75,749 మంది మాత్రమే ఉన్నారు. 1,829 మంది రైతులతో ఈ–కేవైసీ చేయించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. అన్నదాత సుఖీభవ కింద అర్హత పొందినప్పటికీ ఈ–కేవైసీ తిరస్కరణకు గురికావడంతో 2,896 మంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. వైఎస్ఆర్సీపీ పాలనలో వైఎసార్ రైతుభరోసా కింద 2023–24 సంవత్సరంలో పెట్టుబడిసాయం పొందిన రైతుల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు 23,574 మంది రైతులకు మొండిచేయి చూపుతుండటం గమనార్హం.
కౌలుదారులకు
అన్నదాత సుఖీభవ లేనట్లే..
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కౌలు రైతులు, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, అటవీ భూముల (ఆర్వోఎఫ్ఆర్)ను అనుభవిస్తున్న రైతులందరికీ వైఎసార్ రైతుభరోసా అమలు చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం కౌలు రైతులు, ప్రభుత్వ భూములు, ఎండోమెంటు భూములు, అటవీ భూముల (ఆర్వోఎఫ్ఆర్)ను అనుభవిస్తున్న రైతులందరికీ మొండిచేయి చూపుతోంది. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25వేల సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 10 వేల వరకు సీసీఆర్సీ కార్డులు జారీ అయ్యాయి. అన్నదాత సుఖీభవ కింద ఒక్క కౌలుదారుకు కూడా పెట్టుబడి సాయం అందని పరిస్థితి.
కొత్త రైతులకు అందని
పీఎం కిసాన్ సాయం
ఐదేళ్లలో వేలాది మంది కొత్త రైతులు వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. భూములను కొనుగోలు చేయడం ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలు కూడా జారీ అయ్యాయి. అయితే వీరికి పీఎం కిసాన్ సాయం అందని పరిస్థితి. 2019 ఫిబ్రవరి 1లోపు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సాయం అందుతోంది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత కనీసం 50 వేల మంది భూములు కొనుగోలు చేయడం ద్వారా వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. వీరంతా తమకు కూడా పీఎం కిసాన్ సాయం వర్తింపజేయాలని కోరుతున్నారు.
పీఎం కిసాన్లో భారీగా కోత
ఊరిస్తున్న ‘అన్నదాత సుఖీభవ’
అడ్డగోలు కోతలతో
వేలాది మందికి మొండిచేయి
2023–24లో 2,94,598 మందికి
వైఎసార్ రైతుభరోసా
అన్నదాత సుఖీభవ
2,71,024 మందికే పరిమితం
పెట్టుబడి సాయానికి నోచుకోని
కౌలురైతులు
పీఎం కిసాన్ లబ్ధిదారుల్లోనూ
భారీగా కోత
2024 ఎన్నికల సమయంలో పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేల పెట్టుబడిసాయం అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు పీఎం కిసాన్తో కలిపి ఇస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబంలో ఎంతమందికి భూములు ఉంటే అందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని రైతులను మభ్యపెట్టారు. ఇప్పుడు కుటుంబం యూనిట్గా అమలు చేస్తుండటం చంద్రబాబు రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతోంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) కింద కేంద్రం రైతులకు 19వ విడత ఆర్థిక సాయాన్ని ఆగస్టు 2న రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయనుంది.
18వ విడతతో పోలిస్తే 19వ విడతలో ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య తగ్గింది.
19వ విడతతో పోలిస్తే 20వ విడతలో
లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
18వ విడతలో 2,45,252 మంది రైతులకు లబ్ధి చేకూరగా.. 19వ విడతలో ఆ సంఖ్య 2,42,934కు తగ్గింది.
20వ విడతలో ఏకంగా 2,38,693కు తగ్గిపోవడం గమనార్హం.
మొత్తం 4,241 మంది రైతులకు మొండిచేయి చూపడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.