
పేదలపైన కక్ష
మాది రెక్కాడితేనే కానీ డొక్కా నిండని కుటుంబం. చాలా నిరుపేద కుటుంబం అని గుర్తించి జగనన్న పాలనలో మాకు అమ్మ ఒడి పథకం వచ్చింది. పగిడ్యాలలో నా కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. మాకు ఎలాంటి చరస్థిర ఆస్తులు లేవు. మాకు ఒకే కుమారుడు. చదివించే ఆర్థిక స్థోమత లేదు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం ఇవ్వాలి. జగనన్న పాలనలో అమ్మ ఒడి పథకం ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు. మాలాంటి పేదలపైన కక్ష కట్టి తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేసింది.
– లలితమ్మ, పాలమర్రి గ్రామం,
పగిడ్యాల మండలం
● ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామానికి చెందిన ఖాదర్ బాషా, కె.మౌలాబీ అనే దంపతులకు ముగ్గురు కూతుర్లు. 1వ తరగతి, 4వ తరగతి, 7వ తరగతులు చుదువుతున్నారు. గత ప్రభుత్వంలో వీరికి అమ్మ ఒడి పథకం కింద నగదు జమ అయ్యింది. మూడు ఎకరాల భూమి ఉంటే ప్రస్తుతం వారికి 10 ఎకరాల భూమి ఉన్నట్లు చూపి అనర్హులను చేశారు.
● గోనెగండ్ల మండలం ఆలువాల గ్రామానికి చెందిన శ్రీనివాస ఆచారి, వి.మహలక్ష్మీ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త వడ్రంగి పని చేస్తూ వారికి ఉన్న ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. మహలక్ష్మీ నిత్య కూలీ పనికి వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో వీరి అమ్మఒడి వచ్చింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద వీరికి 10 ఎకరాల భూమి ఉందని అనర్హులను చేశారు.
● గూడూరు మండలం పొన్నకల్లు, జూలకల్లు గ్రామాలకు చెందిన సచివాలయం పరిధిలో 136 మందిని అనర్హుల జాబితాలో చూపించారు. ఇందులో 91 మంది చిన్న, సన్నకారు రైతులే. ఈ రైతుల భూములకు మూడు, నాలుగు దశబ్దాల క్రితం సాగు నీరు వచ్చేది. రెవెన్యూ రికార్డుల్లో మాగాణి ఉండటంతో నిబంధనలతో అర్హులు కాలేదు. వీరికి గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ఇచ్చింది. ప్రస్తుతం రాలేదు.
● కోడుమూరు మండలంలో ఒకే ఆధార్ నంబరు 19 మంది విద్యార్థులకు చూపిస్తోంది. దీంతో ఎంపీపీఎస్ అనుగొండ, ఎంపీపీఎస్ పులకుర్తి, కర్నూలు శ్రీచైతన్య స్కూల్ , కర్నూలు నారాయణ స్కూల్కు చెందిన విద్యార్థులకు అమ్మ వందనం పథకం అమలు కాలేదు.
● నిబంధనలతో జిల్లాలో 60 వేల మంది విద్యార్థులు.. తల్లికి వందనం పథకానికి అనర్హులయ్యారు.
కర్నూలు సిటీ: ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక మరచిపోవడం.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే తూతూ మంత్రంగా అమలు చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటే. తల్లికి వందనం పథకం అమలును ఇందుకు నిదర్శనంగా ప్రజలు చూపుతున్నారు. సూపర్ సిక్స్ హామీల విషయాన్ని 2023 మే నెలలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు చెప్పారు. రెండేళ్లు దాటిపోయింది. అఽధికారంలోకి వచ్చి మొదటి ఏడాది ఎగ్గొట్టి.. సాకులు వెతుక్కుంటూ ఏప్రిల్, మే నెలలో ఇస్తామన్నారు. తల్లికి వందనం పథకం అంటూ ఈ నెల 12వ తేదీన ప్రకటించి జాబితాలు విడుదల చేశారు. నిబంధనల పేరుతో చాలా మందిని అనర్హులను చేశారు.
తప్పుల తడకగా ...
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లివందనం పథకం ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. ఎలాంటి నిబంధనలు ఉండబోవని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలు విధించి తప్పులు తడకగా జాబితా రూపొందించారు. హౌస్హోల్డ్ సర్వే పేరుతో భారీగా కోత విధించారు. మొన్నటి వరకు ముగ్గురుకి మాత్రమే అర్హత ఉండగా వ్యతిరేకత రావడంతో నలుగురికి, ఆ తరువాత ఐదుగురు వరకు పొడిగించారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారమే జిల్లాలో 1,245 మంది తల్లులకు ఆరుగురు, ఆపై పిల్లలు ఉన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వీరందరూ అనర్హులే!
ని‘బంధనాలు’
జిల్లాలో 4.49 లక్షల మంది విద్యార్థులు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ సర్వే చేశారు. ఈ సర్వే రిపోర్టు ఆధారంగా తయారు చేసిన తల్లికి వందనం జాబితాలను జిల్లాలోని 672 సచివాలయాలకు పంపించారు. అర్హులు, అనర్హుల జాబితా వేర్వేరుగా సచివాలయాల్లో ప్రదర్శించి ఫిర్యాదులు తీసుకుంటారు. తుది జాబితాను ఈనెల 30వ తేదీన ప్రకటించి జూలై 5వ తేదీన వీరితో పాటు 1వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్లో చేరే విద్యార్థులకు తల్లికి వందనం నగదు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భూముల విషయంలోనే ఎక్కువగా అనర్హులను చేసినట్లు తెలుస్తోంది. గౌరవ వేతనం వస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సైతం తల్లి వందనం పథకానికి దూరం చేశారు.
కేంద్రీయ విద్యాలయాల
విద్యార్థులు అనర్హులు
తల్లికి వందనం పథకంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల వివరాలు లేవు. ఆ విద్యార్థులను ఈ పథకానికి పరిగణనలోకి తీసుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విద్యార్థులకు అమ్మ ఒడి పథకం అందించింది. యూడైస్ ప్లస్లో కేంద్రీయ విద్యాలయ వివరాలు ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిగా ఆ లింక్ తొలగిపోయింది. ఉద్దేశ పూర్వకంగా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను విస్మరించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇద్దరికీ ఇవ్వాలి
మాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఒకరు 8, మరొకరు 6వ తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా రూ.15వేలు చొప్పున రూ.30వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని ఆశగా ఎదురు చూశాం. గత ఏడాది వేస్తారని నమ్మి మోసపోయాం. ఈ ఏడాది తల్లికి వందనంలో ఇద్దరు పిల్లలకు గాను ఒకరికి మాత్రమే అకౌంట్లో జమ అయ్యింది. మరొకరికి జమ కాలేదు. మాది నిరుపేద కుటుంబం. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాం. హామీ మేరకు ఇద్దరికీ అమ్మవందనం ఇవ్వాలి. –మహబూబ్బీ, నంద్యాల
అస్తవ్యస్తంగా తల్లికి వందనం
పథకం అమలు
జిల్లాలో 4.49 లక్షల మంది
విద్యార్థులు
60 వేల మంది విద్యార్థులు అనర్హులు
నిబంధల పేరుతో భారీగా కోత
గత ప్రభుత్వంలో అమ్మ ఒడి వచ్చినా..
నేడు రాని వైనం
ఫిర్యాదులకు 26 వరకే గడువు..
30న తుది జాబితా

పేదలపైన కక్ష

పేదలపైన కక్ష

పేదలపైన కక్ష