
చంద్రబాబు ఏడాది పాలన అంతా అరాచకమే!
కర్నూలు (టౌన్): చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా అరాచకమే అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. బూటకపు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కల్లూరులోని తన గృహంలో చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలపై బుక్లెట్ను శనివారం ఆవిష్కరించారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల జగనన్న పాలనను చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారన్నారు. జగనన్న హయాంలో రాష్ట్రంలో నవరత్నాల పేరుతో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. అవినీతి లేకుండా.. మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హుల అకౌంట్లలో నిధులు జమ అయ్యాయన్నారు. రెండేళ్ల కరోనా సమయంలోనూ ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఘనత జగనన్నకే దక్కిందన్నారు.
మోసం చంద్రబాబు నైజం
టీడీపీ అధినేత చంద్రబాబుది మోసం నైజమని కాటసాని విమర్శించారు. ఏడాది పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. మహిళలను దగా చేశారని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉచిత బస్సు, ఏటా 5 లక్షల ఉద్యోగాలు, ప్రతి నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ.1500, 50 సంవత్సరాలు నిండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ. 4 వేలు పెన్షన్ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. తల్లికి వందనం తూతూమంత్రంగా అమలు చేస్తూ రాష్ట్రంలో 30 లక్షల తల్లులకు ఎగనామం పెట్టారన్నారు.
అదుపు తప్పిన శాంతిభద్రతలు
ప్రజలకు ఏమీ చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఏడాదంతా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని కాటసాని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. రాష్ట్రంలో వాస్తవాలను తెలుసుకునేందుకు చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలపై బుక్లెట్ను జిల్లా కేంద్రంలో, నియోజకవర్గం కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో
వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
హామీల పేరుతో 5 కోట్ల మంది
ప్రజలకు వెన్నుపోటు
వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి