
ప్రజల విశ్వాసం కోల్పోయిన కూటమి ప్రభుత్వం
ఆలూరు/ఆలూరు రూరల్: ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూ టమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. శనివారం ఆయన స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థలకు కేంద్రం మంజూరు చేసిన రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా పల్లె ప్రగతికి అవరోధంగా మారారన్నారు. సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందించకుండా కూటమి ప్రభుత్వం నయవంచన చేస్తోందన్నారు. ఐదు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసిందని, ఈ నిధు లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్లు గ్రామ పంచాయతీల నిధులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లించారని ఆరోపించారన్నా రు. ఇప్పుడు కూటమి నేతలు ఆ నిధులను ఏమి చేసినట్లన్నారు.
ఏడాదిలోనే
రూ.1.58 లక్షల కోట్ల అప్పు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే రూ.1.58 లక్షల కోట్లు అప్ప చేసిందని ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో గ్రామాల్లో అభివృద్ధి అటకెక్కిందన్నారు. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలకు 18 నెలలుగా గౌరవ వేతనం రావడం లేదన్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే రూ.4.80 కోట్ల గౌరవ వేతనం బకాయి ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నాడన్నారు. పాలనను పక్కనపెట్టి ఆయన సినిమా షూటింగ్లకే పరిమితం అయ్యారని విమర్శించారు.