
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 13న(నేడు) ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశాలకు ఆయా స్థాయీ సంఘాల సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తమకు కేటాయించిన సమాయానికి తప్పక హాజరు కావాలని సీఈఓ కోరారు.
టెన్త్ సప్లిమెంటరీ
ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన పబ్లిక్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు గతనెల 19 నుంచి 28 తేది వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. మూల్యాంకనం గత 31 నుంచి ఈ నెల 2వ తేది వరకు చేపట్టారు. ఫలితాల్లో 72 శాతం ఉత్తీర్ణతతో జిల్లా చివరి స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుంది. ఇదిలాఉంటే రెగ్యులర్ పరీక్షల్లో ఏడాది పాటు తరగతులు నిర్వహించినా 66.1 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఆశించిన స్థాయిలో తరగతులు నిర్వహించకపోయినా 72 శాతం ఉత్తీర్ణత రావడం గమనార్హం. 2023 సప్లిమెంటరీ పరీక్షల్లో 45 శాతం, 2024లో కేవలం 30.60 శాతం మాత్రమే ఉత్తర్ణత వచ్చింది. అలాంటిది ప్రస్తుతం భారీగా ఉత్తీర్ణత శాతం నమోదు కావడం చర్చనీయశంగా మారింది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తుకు ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ఉద్యోగాల కల్పనలో విఫలం
కర్నూలు(సెంట్రల్): ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.సంతోష్కుమార్ విమర్శించారు. కర్నూలులోని సీఆర్భవన్లో గురువారం ఏఐవైఎఫ్ ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరచిపోయారన్నారు. నిరుద్యోగ భృతి కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు పాల్గొన్నారు.
17న పారిశుద్ధ్య
కార్మికులతో యోగా
కర్నూలు(సెంట్రల్): ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 17న 5వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టాలని కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా యోగాంధ్ర నిర్వహణపై జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మండల స్పెషల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 21న జిల్లాలో నిర్వహించే యోగా కార్యక్రమాల్లో 10.65లక్షల మంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా జూన్ 14న రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో రిహార్సల్ నిర్వహించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో జేసీ డాక్టర్ బి.నవ్య, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ పాల్గొన్నారు.
నలుగురు సర్వేయర్ల బదిలీ
కర్నూలు(సెంట్రల్): సర్వే శాఖలో పనిచేస్తున్న నలుగురు మండల సర్వేయర్లను పరిపాలన సౌలభ్యం కింద బదిలీ చేస్తూ ఆ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిప్పగిరి మండల సర్వేయర్గా ఉన్న జి.చిన్ననారాయణను ఎమ్మిగనూరుకు, నందవరం సర్వేయర్ పి.అక్బర్బాషాను ఆలూరుకు, వెల్దుర్తి సర్వేయర్గా ఎస్.హేమంత్ను కర్నూలు రూరల్కు, కోడుమూరు డిప్యూటీ సర్వేయర్ సునీల్కుమార్ను వెల్దుర్తికి బదిలీ చేశారు.
ముగిసిన ఏపీ పీజీసెట్
కర్నూలు కల్చరల్: ఏపీ పీజీసెట్–2025 గురువారంతో ముగిసింది. చివరి రోజు పరీక్షలకు 80 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంలో జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, దూపాడు సమీపంలోని ఐయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. సెషన్–1లో సైకాలజీ, జియోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మధుసూదన్, డాక్టర్ రామలింగారెడ్డి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.