
రమేష్ కుటుంబానికి అండగా ఉంటాం
ఓర్వకల్లు: రమేష్ కుటుంబానికి అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి భరోసా ఇచ్చారు. మీదివేముల గ్రామానికి కాటసానితోపాటు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ తిప్పన్న, జెడ్పీటీసీ సభ్యుడు రంగనాథ్గౌడు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జీకే వెంగన్న, వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం వెళ్లారు. రమేష్ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు. పార్టీ నుంచి వచ్చిన రూ.2 లక్షల చెక్కును, కాటసాని స్వతహాగా మరో రూ.50 వేలను అందజేశారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి విలేకరుతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు నేరపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
‘రెడ్బుక్’ పేరిట నేరం!
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో నేర రాజకీయాలను టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని కాటసాని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కాలమైనా హామీల అమలులో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పక్కదోవ పట్టించేందుకు నేరపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గ్రామాభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా రమేష్ నాయుడు పనిచేసేవాడని, అతను లేకపోవడం పార్టీకి తీరని లోటని అభిప్రాయపడ్డారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే..
తాను ఫ్యాక్షన్ కుటుంబం నుంచే వచ్చానని, దాని వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకొని ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించడం లేదని కాటసాని గుర్తుచేశారు. రమేష్ నాయుడి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకనే టీడీపీ వారు ఈ నెల 5న హత్య చేశారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. హంతకులు ఎవరనేది ఇప్పటికే తేలిపోయిందని, హత్య వెనుక ఎవరి పాత్ర ఉందో తనకు తెలుసని, పోలీసులపై ఉన్న నమ్మకంతో చట్టానికే వదిలేస్తున్నామన్నారు. ఈ కేసులో నిజమైన హంతకులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన ఓర్వకల్లు మండలంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఉపేక్షించబోమని హె చ్చరించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు చెన్నా రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ప్రవీణ్కుమార్రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు నాగతిరుపాలు, హరినాథ్రెడ్డి, మహేశ్వరరెడ్డి, సోమ శేఖర నాయుడు, బీరం పుల్లారెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.
పార్టీ నుంచి రూ.2 లక్షల నగదు
అందజేత
సొంతంగా మరో రూ. 50 వేలు
ఇచ్చిన కాటసాని