
అర్జీలను గడువులోపు పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనురాధ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినుతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాగిన్లో వచ్చిన అర్జీలను కొన్ని శాఖల అధికారులు వారం రోజులైనా చూడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే కలెక్టర్ జిల్లా కేంద్రంలో లేకపోవడంతో కార్యక్రమం పూర్తి మొక్కుబడిగా సాగింది. డీఆర్వో సెలవులో ఉండటం.. జాయింట్ కలెక్టర్ బి.నవ్య మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్లో పాల్గొనడంతో పీజీఆర్ఎస్కు ‘స్పందన’ కరువైంది. ఎంతో కష్టపడి వ్యయప్రాయాసాలకోర్చి వచ్చిన అర్జీదారులు ఉన్నతాధికారులు లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.