
అమ్మను చూసి వస్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎమ్మిగనూరురూరల్: పండగ రోజు అమ్మను పలుకరించి తిరుగు ప్రయాణమైన కుమారుడు మార్గమధ్యలో మృత్యుఒడి చేరాడు. ఆదోని – కర్నూలు రహదారిలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆదోని పట్టణంలోని కౌడల్ పేటకు చెందిన అల్లాబకాష్, ఖాజాబానుల కుమారుడు షాకీర్(45)కు ఎమ్మిగనూరు పట్టణం ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఉసేన్బీతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సెంట్రింగ్ పనులు చేసే షాకీర్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం కుటుంబంతో ఎమ్మిగనూరు చేరుకున్నాడు. అయితే అతని తల్లి ఖాజాబాను ఆదోనిలో ఉండటంతో అప్పుడప్పుడు వెళ్లి పలుకరించి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం బక్రీద్ సందర్భంగా ఆదోనికి చేరుకున్నాడు. అక్కడే తల్లి, బంధువులతో పండగ జరుపుకుని శనివారం ఎమ్మిగనూరుకు బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో బనవాసి ఫారం సమీపంలో స్కార్పియ్ వాహనం ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన షాకీర్ను ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రిలో మృతుడి భార్య, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.