
కౌలు రైతు ఆత్మహత్య
దేవనకొండ: మండలంలోని వెలమకూరు గ్రామ సమీపంలో కౌలు రైతు బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన బోయ హరిబాబు(36) వెలమకూరు గ్రామంలో ఆర్ఎంపీగా జీవనం సాగిస్తూ అక్కడే కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు సరిగా పండక సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని చెల్లించే మార్గంలేక గ్రామ శివారులోని జమ్మి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బంగారు గొలుసు
అపహరణ
కర్నూలు (అర్బన్): నగరంలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలోని టెలికాం నగర్లో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీకి చెందిన సుశీలమ్మ తమ ఇంటికి సమీపంలోని టైలర్ షాప్నకు వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వస్తున్న సమయంలో అదే దారిలో నడుచుకుంటూ వచ్చిన అగంతకుడు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మందుబాబులకు
జైలు శిక్ష
మంత్రాలయం రూరల్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పట్టుబడిన నలుగురికి ఎమ్మిగనూరు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ జరిమానా విధించారు. మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మద్యం తాగుతూ రాఘవేంద్రపురానికి చెందిన మల్లికార్జున, హనుమంతుతో పాటు నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన రాముడు, దాసరి మల్లికార్జున పట్టుబడ్డారు. గురువారం వారిని కోర్టులో హాజరు పర్చగా ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించిన్నట్లు ఎస్ఐ శివాంజల్ తెలిపారు.
వైద్యం కోసం వెళ్తూ మార్గమధ్యంలో..
బండి ఆత్మకూరు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యలో మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వెలుగోడు మండల కేంద్రలోని గాంధీనగర్కు చెందిన హుసేన్బాషా (33) పాత ఇనుము సామగ్రి వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు గురువారం హుసేన్బాషాను తీసుకుని ద్విచక్రవాహనంపై చికిత్స నిమిత్తం నంద్యాలకు బయలుదేరారు. బండి ఆత్మకూరు గ్రామ సమీపానికి చేరుకోగానే అతడిలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

కౌలు రైతు ఆత్మహత్య