
జిల్లాలో ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ
● అనేక మందికి వ్యాధి లక్షణాలు
● జీజీహెచ్ను ఆశ్రయిస్తున్న రోగులు
● జేఎన్1 వైరస్గా అనుమానం
● ఇప్పటికే 20 పడకలతో ప్రత్యేక వార్డు
● నామమాత్రంగా కోవిడ్ పరీక్షలు
● వంద పరీక్ష కిట్లతో
సరిపెట్టిన ప్రభుత్వం
కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. క్రమంగా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య అధికంగానే ఉంటోంది. నాలుగైదేళ్ల క్రితం ఆ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ప్రాణాలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని రంగాలను కుదేలు చేసింది. దీని దాటికి ఎన్నోవేల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లక్షలాది మంది తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. చికిత్స చేయడానికి కనుచూపు మేరలో డాక్టర్ కనిపించని పరిస్థితి. ఉన్నా ఆసుపత్రిలో పడకలు లభించని దుస్థితి. ఇలాంటి వైరస్ మళ్లీ వస్తోందన్న ప్రతిసారీ ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతోంది. ఇప్పుడు కూడా వారం రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు ఏవీ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం.
కర్నూలు(హాస్పిటల్): కోవిడ్ మహమ్మారి మరోమారు భయపెడుతోంది. ఈ విషయంలో ఉన్నతస్థాయి ఆదేశాలతో అధికారులు నోరు మెదపని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విస్తరిస్తున్న జేఎన్–1 వైరస్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భరోసా కల్పిస్తున్నా.. ఎప్పుడు ఎలా విజృంభించి ప్రాణాలను తీస్తుందోననే భయం వెంటాడుతోంది. ప్రజలు కోవిడ్ బారిన పడితే చికిత్స అందించేందుకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నా.. నామమాత్రమేనని తెలుస్తోంది. ఆసుపత్రిలోని పాత గైనిక్ విభాగంలో 20 పడకలతో కోవిడ్ వార్డుగా మార్పుచేసి.. ప్రతి పడకకూ ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటు చేసి మమ అనిపించారు. ఆసుపత్రిలోని పూర్వ ఐడీ వార్డులో ఏర్పాటు చేసిన నెగిటివ్ ప్రెజర్ రూమ్ నిరుపయోగంగా ఉంది. గతంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంకులు పనిచేస్తున్నాయో లేదో కూడా ఇప్పటి వరకు తెలుసుకోని పరిస్థితి. అప్పటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పనిచేయడం లేదని సమాచారం. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ సరిపోతుందనే భావనలోనే అధికారులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చిత్తశుద్ధిలేని ప్రభుత్వం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు కోవిడ్ లక్షణాలతో ఇటీవల పలువురు రోగులు చికిత్స కోసం వస్తున్నారు. వీరికి ఉన్న లక్షణాలను గుర్తించిన వైద్యులు కోవిడ్గా నిర్ధారించి చికిత్స రాసి పంపుతున్నారు. అంతేగానీ లక్షణాలతో వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించడం లేదు. తప్పనిసరైతే తప్ప రోగులకు కోవిడ్ కిట్ల ద్వారా పరీక్షించకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇటీవల ఆసుపత్రికి వంద టెస్ట్ కిట్లను మాత్రమే పంపడం చూస్తే కోవిడ్ను అడ్డుకోవడంలో ఎంతటి చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతోంది. కోవిడ్ లక్షణాలతో వచ్చిన వారిని గతంలో ప్రత్యేకంగా ఓపీ నెం.99ను క్రియేట్ చేసి అందులో పరీక్షించేవారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లు లేవు. జనరల్ ఓపీల్లో సాధారణ రోగుల తరహాలోనే పరీక్షిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
పీహెచ్సీల్లో కానరాని ఏర్పాట్లు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వస్తోందంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఏర్పాట్లు చేసేవారు. కానీ ప్రస్తుతం జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కోవిడ్ను ప్రాథమికంగా నిర్ధారించేందుకు కనీసం ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి రోగులకు యాంటిబయాటిక్స్, పారాసిటమాల్, స్టెరాయిడ్స్ ఇచ్చి పంపుతున్నారు. గతంలో జిల్లాలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, అందరికీ ఇమ్యూనిటి వచ్చి ఉంటుందని, కాబట్టి ఎలాంటి కోవిడ్ వైరస్లు వచ్చినా ఏమీ కాదనే ధీమాలో అధికారులు ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా కోవిడ్ గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడవద్దని, ప్రకటనలు కూడా ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో
ఏడుగురికి పాజిటివ్
● ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధునికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్నాడు.
● మంత్రాలయం మండలం పారందొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతికి కోవిడ్ పాజిటివ్ నిర్ధా రణ కావడంతో ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.
● కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న 54 ఏళ్ల ఓ వైద్యురాలు కోవిడ్ బారిన పడ్డారు. ఈమె హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
● కర్నూలు మండలం దిన్నెదేవరపాడుకు చెందిన 25 ఏళ్ల వ్యక్తికి, గోనెగండ్లకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, కర్నూలుకు చెందిన 20 ఏళ్ల యువతికి, అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి గురువారం పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఒక పీజీ వైద్య విద్యార్థిని ఉన్నారు.
5,709
60 ఏళ్లు పైబడిన
వృద్ధులు
165
16ఏళ్లలోపు యువకులు
1,037
పాజిటివ్ డయాలసిస్ పేషెంట్లు
9,939
16–60 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు
1.45 లక్షలు
ఉమ్మడి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్లు, ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన
కోవిడ్ బాధితులు
876 రెండు వేవ్లలో మరణాలు
కర్నూలు పెద్దాసుపత్రిలో
కోవిడ్ కేసులు ఇలా..
సంవత్సరం కేసులు
2020 6,607
2021 9,206
( గమనిక: 2022లో మూడో వేవ్ వచ్చినా
పెద్దగా ప్రభావం చూపలేదు. )
897 పాజిటివ్ గర్భవతులు

జిల్లాలో ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ

జిల్లాలో ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ