చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎల్పీజీ గ్యాస్ వినియోగాన్ని తగ్గించి పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజవాయువు, ఇతర విద్యుత్ ఆధారిత వంట పరికరాల వినియోగం వైపు మారాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే నాగాయలంక రిఫైనరీ నుంచి సుమారు 450 కిలోమీటర్ల మేర పీఎన్జీ పైప్లైన్ అందుబాటులో ఉందని ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్ తాడిగడప మునిసిపాల్టీల పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు తక్షణమే పీఎన్జీ వినియోగానికి మారాల్సిన అవసరం ఉందన్నారు. 90 రోజుల్లోపు మారకపోతే ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో పీఎన్జీకి మారనున్న 417 పరిశ్రమలు, 179 ఆస్పత్రులు, ఎనిమిది ప్రధాన దేవాలయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. అన్నక్యాంటీన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రాధాన్యత క్రమంలో పీఎన్జీ వినియోగం చేపట్టాలని సూచించారు. గృహ వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇండక్షన్ స్టౌలు, బయో గ్యాస్ స్టౌలతో ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


