రక్తదానాన్ని అదృష్టంగా భావించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రక్తదానం చేయడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడటం అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉందని, రక్తదానానికి మించిన మరొక దానం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. రక్తదానం చేసేలా యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, నలంద విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నందు గల నలంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం అనేక మంది రోగులకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తుందని అన్నారు. జీవిత కాలంలో వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తాన్ని దానం చేయవచ్చన్నారు.
మరణాలను తగ్గించాలి..
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ అత్యవసర సమయంలో అవసరమైన రక్తం లభించక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎన్టీఆర్ జిల్లాలో జరగకుండా ఉండటానికి రెడ్ క్రాస్ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, సెక్రటరీ సీహెచ్ చిట్టిబాబు, నలంద కళాశాల కరస్పాండెంట్ ఏ. విజయబాబు, ప్రిన్సిపాల్ అనురాధ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


