హెల్మెట్.. ప్రాణానికి కవచం లాంటిది
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా, పోలీసు శాఖల అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీని కలెక్టరెట్ వద్ద నుంచి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో హెల్మెట్ ధరించి వాహనాలను నడపడంపై పూర్తి అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతున్న తరుణంలో హెల్మెట్ ధరించడంపై మహిళలకు అవగాహన కల్పించి చైతన్య వంతులను చేయడం ఎంతో అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ శాతం మరణాల బారిన పడుతున్నారన్నారు. ఇటువంటి మరణాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
సీట్ బెల్ట్.. హెల్మెట్ తప్పనిసరి..
డీసీపీ ఎస్కే హసీనా బేగం మాట్లాడుతూ కార్లు ద్విచక్ర వాహనాలు నడిపే వాహన చోదకులు సీటు బెల్టు హెల్మెట్ తప్పక ధరించి వాహనాలను నడపాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా బైక్ హెల్మెట్ ర్యాలీలో ఏసీపీ వంశీధర్ గౌడ్, ఆర్టీఓలు ఆర్ ప్రవీణ్, కె. వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


