రెబ్బెన: కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి విమర్శించారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో కార్మికులకు 200కు పైగా హక్కులు సాధించి పెట్టామని తెలిపారు. కానీ ప్రస్తుత గుర్తింపు సంఘం యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఏడాదిగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల పనితీరును కార్మికులు గమనిస్తున్నారని, త్వరలోనే ఆ సంఘాలకు గుణపాఠం తప్పదని అన్నారు. సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు, సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, తిరుపతి, ఫిట్ కార్యదర్శి రమేశ్, వెంకటేశ్, నాయకులు కై త స్వామి, కృష్ణ, రాజమౌళి, రమేశ్, చంద్రశేఖర్, సురేందర్, మల్లేశ్, శంకర్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.


