గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పంపిణీ చేసే పౌష్టికాహార వివరాలు.
చిన్నారులకు బోధించే పాఠాలు, వైద్య పరీక్షల సమాచారం.
కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్, పోషణ్ దివస్, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషియన్ సెషన్ వంటి కార్యక్రమాల వివరాలు.
అంగన్వాడీ కేంద్రాల స్థితిగతులు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యాలు, మరమ్మతుల వివరాలను ఎప్పటికప్పుడు నివేదిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
కెరమెరి: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్గా మారనుంది. క్షేత్రస్థాయిలో మాతాశిశు సంరక్షణ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల సేవలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కొన్నేళ్లుగా పాతతరం ఫోన్లు, సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న సిబ్బందికి నూతన స్మార్ట్ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్లు అందించారు.
871 స్మార్ట్ఫోన్లు పంపిణీ
జిల్లాలోని 40 సెక్టార్ల పరిధిలో మొత్తం 1006 అంగ న్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 0– 6 నెల ల చిన్నారులు 2,855 మంది, మూడేళ్లలోపు వారు 18,657 మంది, 3– 6 ఏళ్ల లోపు వారు 24,196 మంది లబ్ధి పొందుతున్నారు. వీరితో పాటు 2,698 మంది బాలింతలు, 4,992 మంది గర్భిణులు, 19,635 మంది కిశోర బాలికలకు సేవలు అందుతున్నాయి. 2021లో అంగన్వాడీ కార్యకర్తలకు 2జీ సాంకేతికత కలిగిన ఫోన్లను అందించారు. లబ్ధిదా రులకు పౌష్టికాహారాన్ని పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ‘పోషణ్ ట్రాకర్’ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత ఫోన్లలో సర్వర్ సమస్యలు, సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం, డిస్ప్లేలు పగిలిపోవడంతో అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల ఫేషియ ల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) నమోదులో తీవ్ర జాప్యం జరిగేది. ఆర్థిక స్థోమత ఉన్న కొందరు కార్యకర్తలు సొంతంగా 4జీ ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. మరికొందరు పాత ఫోన్లతోనే కుస్తీ పడుతూ రికార్డుల నమోదులో వెనుకబడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నూతన స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అంగన్వాడీ సిబ్బందికి నూతన ఫోన్లను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 835 అంగన్వాడీ కార్యకర్తలు ఉండగా.. 31 మంది సూపర్వైజర్లు, ఐదుగురు బ్లాక్ కోఆర్డినేటర్లకు కలిపి మొత్తం 871 మందికి స్మార్ట్ఫోన్లను అందజేశారు.
నెలకోసారి ఎఫ్ఆర్ఎస్ నమోదు
అంగన్వాడీ కేంద్రాల్లోని 3 నెలల నుంచి 6 ఏళ్ల వయస్సు గల చిన్నారులు, 14 నుంచి 18 ఏళ్ల కిశోర బాలికలకు ప్రతినెలా ఎఫ్ఆర్ఎస్(ముఖ గుర్తింపు) హాజరు తీసుకుంటారు. దీనికోసం కొత్త ఫోన్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రపంచం 5జీ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో మళ్లీ 4జీ ఫోన్లే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తసెల్ టవర్లు 5జీ నెట్వర్క్ అందిస్తున్న వేళ, 4జీ ఫోన్లతో భవిష్యత్తులో మళ్లీ పాత సమస్యలు పునరావృతం కావచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
ప్రాజెక్టుల వారీగా అందించిన ఫోన్లు
ప్రాజెక్టు ఫోన్లు
ఆసిఫాబాద్ 228
జైనూర్ 136
కాగజ్నగర్ 165
సిర్పూర్(టి) 189
వాంకిడి 117
సూపర్వైజర్లు 31
బ్లాక్ కోఆర్డినేటర్లు 5
ఇక సేవలు వేగవంతం
తాజాగా 4జీ సాంకేతికతతో కూడిన ఫోన్లు అందడంతో అంగన్వాడీ సేవలు వేగవంతం కానున్నాయి. ప్రతిరోజూ యాప్లో లబ్ధిదారులకు సంబంధించిన 14 రకాల రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.


