
ఆక్రమణలు ఆగేనా..?
కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పట్టణానికి అత్యంత కీలకమైన ప్రధాన నాలాను ఇష్టారీతిన ఆక్రమించుకుని నిర్మాణాలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్ అధికారులు నాలా స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఓ ప్రైవేట్ పాఠశాల భవనాన్ని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో దృష్టి సారించి కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
కాలనీలకు వరద ముప్పు..
పట్టణంలోని ప్రధాన కాలువ కబ్జాకు గురికావడంతో లోతట్టు ప్రాంతాలైన సంజీవయ్య కాలనీ, ద్వారకానగర్, కౌసర్నగర్, కృష్ణకాలనీ, కన్యకాపరమేశ్వరి దేవాలయం ఏరియాల్లోని ప్రజలకు వరద ముప్పు పొంచి ఉంది. ఏటా వర్షాలకు బురద నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఆక్రమణలు పెరిగి ప్రధాన కాలువ కుచించుకుపోయింది. ప్రధాన నాలాపై అక్రమ కట్టడాలను గురువారం అధికారులు ఓవైపు కూల్చివేస్తుండగానే.. అదే నాలాపై మరోప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేసింది. తిరందాస్ టాకీస్ సమీపంలో ఓ ఇంటి యజమాని ప్రధాన నాలాను కబ్జా చేసి కట్టడాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయమైన మున్సిపల్ కమిషనర్ అంజయ్యను ‘సాక్షి’ సంప్రదించగా పట్టణంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పాఠశాల భవనం కూల్చివేత
కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన నాలాపై అక్రమంగా నిర్మించిన ఓ ప్రైవేట్ పాఠశాల భవనాన్ని గురువారం తెల్లవారుజామున మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారి యశ్వంత్ కుమార్, సిబ్బంది పొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకపోవడంతో గతంలో నోటీసులు జారీ చేశామని తెలిపారు. పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడంతో తామే కూల్చివేశామని స్పష్టం చేశారు. పట్టణ సీఐ ప్రేమ్కుమార్, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
కాగజ్నగర్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు
ప్రధాన నాలాను కబ్జా చేస్తున్న వైనం
గురువారం ఓ ప్రైవేట్ పాఠశాల భవనాన్ని కూల్చివేసిన అధికారులు

ఆక్రమణలు ఆగేనా..?