ఒకరి అనుమానాస్పద మృతి!
కాగజ్నగర్టౌన్: స్థానిక కాపువాడలో మంగళవారం రాత్రి ఒకరు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాపువాడలో నివాసముంటున్న మహిళా హోంగార్డు సురేఖ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకికాడకు చెందిన శ్రీనివాస్ (50) ఉపాధి కోసం వచ్చి అద్దెకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శ్రీనివాస్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, పట్టణ సీఐ బుద్దేస్వామి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతిగా మద్యం సేవించి మృతి చెందాడా? లేక ఏదైనా గొడవ జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సీఐ బుద్దే స్వామిని సంప్రదించగా పోస్ట్మార్టం రిపోర్టు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.