గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకర టీ.ఎస్.
పంద్రాగస్టుకు ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: వివిధ ప్రాంతాల నుంచి శ్రమకోర్చి వచ్చే ప్రజలు ఇస్తున్న దరఖాస్తులు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్.. ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డీఆర్వో రామమూర్తి, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
● ఖానాపురం హవేలీ శివారు టేకులపల్లికి చెందిన వి.వెంకటయ్య ఈనెల వృద్ధాప్య పింఛన్ అందలేదని ఫిర్యాదు చేశారు.
● ఖమ్మం లెనిన్నగర్కు చెందిన ఎస్.కే నాజియా తలసేమియాతో బాధపడుతున్న తన కుమార్తెకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
● ఖమ్మం అర్బన్ మండలం కొత్తూరుకు చెందిన ఎం.సూర్యప్రకాష్ పాపిరెడ్డి ఖమ్మం – దేవరపల్లి హైవే ధంసలాపురం ఎంట్రీ వద్ద తమ భూమికి దారి ఇప్పించాలని కోరారు.
● సింగరేణి మండలం పేరపల్లిలోని ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్(టీఎస్ఎస్ఏ) నాయకులు దామల్ల సత్యనారాయణ, కొప్పుల రామారావు వినతిపత్రం అందజేశారు.
తల్లిపాలలో పోషకాలు
ఖమ్మం వైద్యవిభాగం: ఈనెల 7వ తేదీ వరకు కొనసాగనున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టరేట్లో పోస్టర్లను ఆవిష్కరించాక ఆయన మాట్లాడారు. శిశువు పుట్టినప్పటి నుంచి మొదటి ఆరు నెలలు తల్లి పాలే పట్టించేలా గర్భిణ ులకు అవగాహన కల్పించాలని, తద్వారా శిశువు ఎదుగుదల, అభివృద్ధి, రోగ నిరోధక శక్తికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, డీఆర్ఓ సీహెచ్.రామ్మూర్తి, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీడబ్ల్యూఓ ఏ.ప్రమీల, డీఎంహెచ్ఓ రామారావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశమయ్యారు. శాఖల వారీగా ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఈనెల 8లోగా డీపీఆర్కు అందించాలని, ప్రతీ శాఖ నుంచి ప్రశంసా పత్రాల కోసం ఇద్దరు ఉద్యోగుల పేర్లనే ప్రతిపాదించాలని సూచించారు. అనంతరం ఆహ్వా నాలు, శాఖల వారీ స్టాళ్ల ఏర్పాటు తదితర అంశాలపై సూచనలు చేశారు.


