ఖమ్మం వైద్యవిభాగం: బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈనెల 17వ తేదీన నిర్వహించే సమన్వయ కమిటీల సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని శ్రీహర్ష కన్వెన్షన్లో బుధవారం ఉదయం 11గంటలకు మొదలయ్యే నియోజకవర్గాల ముఖ్య ప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల ఇన్చార్జ్లు, సభ్యత్వ నమోదు బాధ్యులు, ముఖ్యనేతలు హాజరవుతారని పేర్కొన్నారు. వీరు కాకుండా ఇతర శ్రేణులు వచ్చి ఇబ్బంది కలిగించవద్దని రవీందర్రావు, మధుసూదన్ కోరారు. కాగా, పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ విధానంలో చేపట్టనున్నందున త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ యాప్ను విడుదల చేస్తారని తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ సమావేశంలో నాయకులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, బిచ్చాల తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.
వెల్లడించిన ఎమ్మెల్సీలు
రవీందర్రావు, మధు


