మైసూరు: మంత్రి పదవి రాకపోవడంతో మైసూరు నగరం ఎన్.ఆర్. నియోజకవర్గ ఎమ్మెల్యే తన్వీర్ సేట్ అభిమానులు, అనుచరులు రచ్చ చేశారు. హఠాత్తుగా భారీ నిరసన చేయడంతో నగరంలో తీవ్ర గందరగోళం నెలకొంది. తబ్రేజ్ అనే అభిమాని పురుగుల మందు తాగి పడిపోయాడు, దీంతో అతన్ని కొందరు ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి చికిత్స జరుగుతోందని, ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఇది ప్రచారమైన వెంటనే పెద్దసంఖ్యలో ఎమ్మెల్యే తన్వీర్ ఇంటిముందు గుమిగూడారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన్వీర్ను చుట్టుముట్టిన అభిమానులు, కార్యకర్తలు ఆయన రాజీనామా చేయాలని పట్టుబట్టారు. కొందరు విలపించారు. ఉదయగిరి పోలీసులు చేరుకుని జనాన్ని అదుపు చేశారు. పలు చోట్ల అభిమానులు నిరసనలు కొనసాగించారు. ఒకరు పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు బాటిల్ను లాక్కున్నారు. నిరసనకారులను వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్లారు.
నిరాశ చెందాను: ఎమ్మెల్యే తన్వీర్
పదవి రాకపోవడంపై ఎమ్మెల్యే తన్వీర్ సేట్ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ చాలా నిరాశ చెందాను, రెండున్నర ఏళ్లు మంత్రి పదవి ఖాయమని హైకమాండ్ ఇచ్చిన హామీ అబద్ధమైంది. కార్యకర్తలకి లోబడి నిర్ణయం ఉంటుంది అని ఆయన అన్నారు. నాలాంటి విధేయులకు న్యాయం చేయలేదన్నారు. తాను ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేయలేదు, ఇప్పటికీ చేయను, పదవి రాకపోవడానికి కొంతమంది రాష్ట్ర నాయకులే కారణమని ఆరోపించారు.
రోడ్లపైకి ఎమ్మెల్యే తన్వీర్ సేట్
అభిమానులు
మంత్రి పదవి కోసం డిమాండ్


