రాయచూరు రూరల్: నగరంలోని ఏపీఎంసీ హమాలీలు, కార్మికుల కాలనీ సమస్యల వలయంలో చిక్కుకుంది. 2011 సంవత్సరంలో 94 మంది ఏపీఎంసీ హమాలీలు, కార్మికులకు నూతన గృహాలు నిర్మించి పంపిణీ చేయడంతో పాటు ఇంటి హక్కు పత్రాలు అందజేశారు. అయితే నగర సభలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో కాలనీ వాసులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరుకు మాత్రమే కార్మికుల కాలనీగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో నగర సభ, ఏపీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షా కాలంలో రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారుతోంది. రాకపోకలకు కాలనీవాసుల అవస్థలు చెప్పుకోలేనివి. మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో రహదారులపై మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. పందుల సంచారంతో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. కాలనీలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయో అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో మురుగు నిల్వ ఉండటంతో చిన్నారులు జారి పడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలనీలో రహదారుల మరమ్మతులు, మురుగు కాలువల నిర్మాణం, పారిశుధ్య చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పాఠశాల భవనానికి మరమ్మతు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
మౌలిక వసతుల కొరత
రహదారిపై ప్రవహిస్తున్న మురుగు
పట్టించుకోని అధికారులు


