మండ్య: తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలన్న కావేరి జల నియంత్రణ కమిటీ ఆదేశాలను ఖండిస్తూ ఐదవ రోజు ఆదివారం మండ్య జిల్లాలో రైతులు, కన్నడ, ప్రజాసంఘాల నిరసనలు కొనసాగాయి. మండ్య నగరంలోని జయ చామరాజేంద్ర ఒడెయార్ సర్కిల్లో కావేరి కమిటీకి, తమిళనాడు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుంభార జాగృతి వేదిక, కర్ణాటక రక్షణ వేదిక, డి.దేవరాజ అరస్ వెనుకబడిన తరగతుల వేదిక, కరునాడ సేవకర్ సంఘాల కార్యకర్తలు ఖాళీ బిందెలను, కుండలను పట్టుకుని ధర్నా చేశారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. వర్షాలు కురవకపోవడంతో కావేరి తీర ప్రాంతాల్లో కరువు ఉంది, ప్రజలు, పశువులు నీటి కొరతను ఎదుర్కొంటుంటే, తమిళనాడుకు ఎలా నీరిస్తారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడాలన్నారు.
ఇప్పటికై నా పరిష్కరించాలి
శతాబ్దపు సవాలుగా మారిన కావేరీ వివాదం నాలుగు రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీస్తోందని, దీనిని ఇప్పటికై నా పరిష్కరించకపోతే, రాబోయే తరాల సంఘర్షణకు దారితీస్తుందని నేతలు అన్నారు. వృథాగా పోయే కావేరి జలాలను కాపాడుకోవడానికి తమిళనాడు ప్రత్యేక డ్యాంను నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు చెరుకు గడలకు ఉరి బిగించుకుని నిరసన తెలిపారు. ఇది మండ్య రైతుల ప్రాణాలను కాపాడే పోరాటం. రైతు బ్రతికి ఉంటేనే దేశం బ్రతుకుతుంది. రైతు పొలంలో నీరు ఉంటేనే మన ఇంట్లో అన్నం ఉంటుంది అని రైతు నేతలు అన్నారు.
కావేరి నీటి విడుదల వద్దంటూ
మండ్యలో ధర్నాలు


