రాయచూరు రూరల్: రాష్ట్రానికే తలమానికంగా రాయచూరులో ఉన్న రాజేంద్ర గంజ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ అధ్వానంగా మారింది. పేరుకు మాత్రమే పాలక మండలి ఉన్నా సౌకర్యాలను సమకూర్చడంలో విఫలమైందని రైతులు, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అతి పెద్ద మార్కెట్ ఉన్నా అన్నదాతలను ఆదుకోని పరిస్థితి నెలకొంది. వరి ధాన్యం అనుకున్న దాని కంటే అధిక స్థాయిలో మార్కెట్కు దిగుమతి అయింది. రాయచూరు ఏపీఎంసీ అసౌకర్యాలకు నిలయంగా మారింది. వర్షాకాలంలో వర్షాలు కురిస్తే ధాన్యం నీటిలో కొట్టుకు పోతాయి. అధికారులు వరిధాన్యానికి టెండర్లు పిలవడం, వాటిని కొనుగోలు చేయడం వరకే ఉన్నారు. అక్కడి పరిస్థితిని అవలోకిస్తే మార్కెట్ అగమ్యగోచరంగా మారింది.
అసౌకర్యాలకు నిలయంగా..
మార్కెట్లో వాహనాల రాకపోకలకు అధ్వానంగా తయారైంది. మురుగు కాలువలో పేరుకు పోయిన చెత్తా చెదారం, ప్లాిస్టిక్ సంచులు, పూడికతో నిండిన కాలువలు, మరోవైపు మురుగు నీరు ముందుకు ప్రవహించకుండా అక్కడే నిలబడడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇన్ని అసౌకర్యాల నడుమ ఏపీఎంసీ పని చేస్తుంది. వర్షాకాలంలో నీరు ముందుకు ప్రవహించకుండా మార్కెట్లో విక్రయాలకు వచ్చిన ధాన్యం తడిసి పోవడానికి ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ ఆప్తుడు ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ ఏనాడూ మార్కెట్ను సందర్శించిన దాఖలాలు లేవు.
జిల్లాలో అన్నదాతలకు అక్కరకు రాని వైనం
ఆందోళన చెందుతున్న రైతులు, వ్యాపారులు


